జూలై 31, 1987..! ఇస్లాం పవిత్ర నగరం మక్కా..! ప్రార్థనలు వినిపించాల్సిన ప్రదేశంలో హాహాకారాలు వినిపించాయి. హజ్ యాత్రలో పాల్గొన్న వేలాది భక్తుల మధ్య ఉద్రిక్తత చెలరేగింది. ఒక నిరసన.. క్షణాల్లో హింసగా మారింది..! రక్తం నేలపై పారింది.. వందల మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పవిత్రతకు ప్రతీకగా భావించే ఆ ప్రదేశం.. ఒక్కరోజులోనే రాజకీయాలు, మతం, శక్తి పోరాటాల రంగస్థలంగా మారింది. ఆ ఘటన తర్వాత ప్రపంచమంతా ఒకే విషయంపై భారీ ఎత్తున చర్చ జరిగింది.
మక్కా, మదీనా లాంటి పవిత్ర స్థలాలపై ఉండే నియంత్రణ ఎవరి చేతుల్లో ఉండాలి? ఇప్పుడిదే ప్రశ్న మళ్లీ వినిపిస్తోంది. ఇరాన్-సౌదీ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, షియా-సున్నీ విభేదాలతో పాటు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాన్ని చూస్తుంటే ఇవి కేవలం భూభాగాల కోసం జరిగే పోరాటంలా అనిపించడంలేదు. ఇది ఇస్లాం గుండెల్లో ఉన్న పవిత్ర స్థలాలపై అధికారం కోసం జరుగుతున్న యుద్ధంలా కొందరికి కనిపిస్తోంది. ఇంతకీ 1932లో ఏర్పడిన సౌదీ అరేబియా శతాబ్దాల చరిత్ర ఉన్న మక్కా, మదీనాపై ఎలా అధికారం సంపాదించింది? మిగిలిన ఇస్లామిక్ దేశాలు ఈ విషయంలో ఎందుకు వెనకపడిపోయాయి?
ఇది ఒక్కరోజులో జరిగిన పరిణామం కాదు. శతాబ్దాల చరిత్ర, యుద్ధాలు, రాజకీయ ఒప్పందాల ఫలితం. మక్కా, మదీనా ఉన్న హిజాజ్ ప్రాంతం చాలా కాలం పాటు ఒట్టోమన్ సామ్రాజ్యం ఆధీనంలో ఉండేది.
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఆ సామ్రాజ్యం బలహీనపడింది. అదే సమయంలో స్థానిక నాయకులు స్వతంత్ర రాజ్యాల కోసం పోరాటాలు ప్రారంభించారు. ఇక 20వ శతాబ్దం ప్రారంభంలో అబ్దుల్ అజీజ్ ఇబ్న్ సౌద్ అనే నాయకుడు అరేబియా ద్వీపకల్పాన్ని ఒక్కటిగా చేయడానికి యుద్ధాలు చేశాడు. 1924-25 మధ్య జరిగిన పోరాటాల్లో హిజాజ్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. చివరకు 1932లో సౌదీ అరేబియా రాజ్యం ఏర్పడింది. అప్పటి నుంచి మక్కా, మదీనా కూడా సౌదీ పాలనలోకి వచ్చాయి.
మక్కా, మదీనా సౌదీ నియంత్రణలోకి రావడమన్నది కేవలం భూభాగానికి సంబంధించిన అంశమే కాదు.. అది మతపరమైన ప్రాధాన్యతను కూడా తెచ్చింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ ఈ రెండు నగరాలు అత్యంత పవిత్రమైనవి.
ప్రతి సంవత్సరం లక్షల మంది హజ్ యాత్ర కోసం ఇక్కడికి వస్తారు. దీంతో సౌదీకి ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఇస్లాం ప్రపంచంలో ప్రభావం చూపగల శక్తిగా సౌదీ మారింది. ఇదే తర్వాతి కాలంలో ఓ పెద్ద సమస్యగా మారింది. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం జరిగిన తర్వాత పరిస్థితి మారింది. షియా సిద్ధాంతంతో నడిచే ఇరాన్.. సున్నీ ఆధారిత సౌదీపై విమర్శలు చేసింది. ఇస్లాం ప్రపంచంలో నాయకత్వం ఎవరిదన్న పోటీ అక్కడి నుంచి మొదలైంది. ఇక్కడే మక్కా, మదీనా అంశం కీలకంగా మారింది. ఈ పవిత్ర స్థలాలపై ఒకే దేశం నియంత్రణ ఉండడం సరైనది కాదని ఇరాన్ వాదించింది. హజ్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని ఆరోపించింది. 1987లో జరిగిన ఘటన తర్వాత ఈ విమర్శలు మరింత పెరిగాయి.
అయితే సౌదీ మాత్రం ఇప్పటికీ ఈ రెండు ప్రాంతాలను తమ హక్కుగానే చెప్పుకుంటుంది. మక్కా, మదీనా పరిరక్షణ తమ బాధ్యతేనని చెబుతోంది. అందుకే ఈ విషయం కేవలం చరిత్ర కాదు.. ఇప్పటికీ కొనసాగుతున్న వివాదం. మధ్యప్రాచ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఉద్రిక్తతలను చూస్తే ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదని.. మతం, అధికారం కలిసిన పోరాటమని చెప్పవచ్చు.