ఏదైనా ఊహించని ఇన్సిడెంట్ జరిగితే చాలు.. మీడియాలో, సోషల్మీడియాలో బాబా వంగా పేరు తెగ వినిపిస్తుంటుంది. ఆవిడ ఈ ఘటన గురించి ముందే చెప్పారంటూ వార్తలు వైరల్ అవుతుంటాయి. ప్రపంచ యుద్ధం వస్తుందని ఆమె ముందే చెప్పిందట, కరోనా మహమ్మారి గురించి కూడా ఆమె ముందే హెచ్చరించిందట, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాలనూ ఆమె సంవత్సరాల క్రితమే చూసిందట. యూట్యూబ్ వీడియోలు, ఫేస్బుక్ పోస్టులు, కొన్ని మీడియా కథనాలు కూడా ఇలాంటి వాటిని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటాయి.
అయితే నిజంగా బాబా వంగా ఇవన్నీ చెప్పారా? లేదా ప్రతి పెద్ద ఘటన తర్వాత ఆమె పేరుతో కొత్త భవిష్యవాణులు తయారు చేస్తున్నారా? ఎందుకంటే ఆమె చెప్పిన మాటలకు స్పష్టమైన రికార్డులేవి లేవని, ఆమె పేరుతో ప్రచారం అవుతున్న చాలా కథలు ఆమె వంగా చనిపోయిన తర్వాత కాలంలో తయారైనవేనని పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకీ బాబా వంగా గురించి ప్రపంచం నమ్ముతున్న ఈ కథల్లో ఎంత నిజం ఉంది?
బాబా వంగా అసలు ఎవరు అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. ఆమె అసలు పేరు వాంగెలియా పాండేవా గుష్టెరోవా. 1911లో అప్పటి ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న పాండో సుర్చెవ్ ప్రాంతంలో జన్మించారు. చిన్నప్పుడే ఒక తుఫాను ఘటన తర్వాత ఆమె కంటి చూపు కోల్పోయారట.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆమె పేరు స్థానికంగా ప్రచారంలోకి వచ్చింది. యుద్ధానికి వెళ్లిన తమ బంధువులు తిరిగి వస్తారా లేదా అని తెలుసుకోవడానికి ప్రజలు ఆమె వద్దకు వెళ్లేవారు. ఎక్కువగా ఆమె చెప్పిన మాటలు ప్రపంచ రాజకీయాలు లేదా భవిష్యత్తు యుద్ధాల గురించి కాకుండా వ్యక్తిగత జీవితాలకు సంబంధించినవేనని పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు, కుటుంబ విషయాలు, వ్యక్తిగత నిర్ణయాల గురించి సలహాలు ఇవ్వడం లాంటి విషయాలే ప్రధానంగా ఉండేవట.
అయితే బాబా వంగా పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది మాత్రం ఆమె మరణం తర్వాతే. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రపంచంలో ఏదైనా పెద్ద సంఘటన జరిగినప్పుడల్లా బాబా వంగా ఇది ముందే చెప్పిందంటూ కథలు ఒక్కసారిగా బయటకు రావడం మొదలైంది.
9/11 దాడులు, కోవిడ్ మహమ్మారి, రష్యా-యుక్రెయిన్ యుద్ధం, ప్రపంచ యుద్ధం వస్తుందనే హెచ్చరికలు, ఏలియన్స్తో మానవుల తొలి పరిచయం లాంటి అనేక ఘటనలను కూడా ఆమె ముందే చెప్పిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఈ భవిష్యవాణులలో చాలా వాటికి ఎలాంటి ఆధారాలు లేవని పరిశోధకులు చెబుతున్నారు. ఆమె చెప్పిన మాటలను రికార్డు చేసిన వీడియోలు లేదా ఆమె రాసిన డాక్యుమెంట్లు ఏవీ లేవు. నిజానికి ఆమె చెప్పినట్లు ప్రచారంలో ఉన్న చాలా మాటలు ఆమె మరణించిన చాలా సంవత్సరాల తర్వాతే బయటకు వచ్చాయి.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే బాబా వంగా చెప్పినట్లు ప్రచారం అయ్యే అనేక కథలు కొన్ని పుస్తకాల్లో కనిపిస్తున్నాయట. ఆమెను కలిసినట్లు చెప్పుకునే కొందరు రచయితలు ఆమె పేరుతో కథలు రాశారు. ఆ కథల్లో ఉన్న మాటలు తర్వాత కాలంలో నిజమైన భవిష్యవాణులుగా ప్రచారం అయ్యాయి. కానీ ఆ రచయితలు నిజంగా బాబా వంగాను కలిశారా అని ప్రూవ్ చేసేందుకు ఎలాంటి రికార్డులు లేవు.
ఇటు సోషల్ మీడియా ఈ కథలను మరింత వేగంగా విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఒక పెద్ద ఘటన జరిగిన వెంటనే యూట్యూబ్ వీడియోలు, ఫేస్బుక్ క్లిప్స్, వైరల్ పోస్టులన్ని ‘బాబా వంగా ముందే చెప్పింది’ అనే టైటిల్తో బయటకు వస్తాయి. ఎక్కువ మంది వీటిని క్రాస్ చెక్ చేయకుండా నమ్మడం వల్ల అవి మరింత వైరల్ అవుతాయి. ఇదే కారణంగా కొన్ని మీడియా సంస్థలు కూడా క్లిక్బైట్ కథనాల కోసం ఈ ఫేక్ న్యూస్ను టెలిక్యాస్ట్ చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో ఈ కథలను రాజకీయ ప్రచారానికి కూడా ఉపయోగిస్తున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. కొన్ని దేశాల్లో బాబా వంగా పేరు ఉపయోగించి నిర్దిష్ట రాజకీయ కథనాలను బలపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అసలు బాబా వంగా ఏమి చెప్పారన్నది స్పష్టంగా తెలియకపోవడం వల్ల ఆమె పేరును వివిధ వార్తలకు ఉపయోగించడం చాలా ఈజీగా మారింది. మొత్తంగా చూస్తే బాబా వంగా పేరు మీద నడిచే వార్తల్లో దాదాపు ఏ కథకు ఎలాంటి ఆధారం లేదని పరిశోధకులు కుండబద్దలు కొడుతున్నారు.
ALSO READ: ఒకే దేవతలను పూజించిన విశ్వాసాలు..4000ఏళ్ల ఇండియా-ఇరాన్ చరిత్ర..!