YCP Rebel MLAs: అనర్హత వేటు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేపై స్పీకర్ తమ్మినేని సీతారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది.. ఇప్పటికే రాతపూర్వకంగా స్పీకర్కు వివరణ ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేలు.. ఈ రోజు స్పీకర్ ఎదుట హాజరుకావాల్సి ఉంది. మరోవైపు.. ఈ రోజే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యేలు ఎలాంటి వివరణ ఇస్తారు.. స్పీకర్ ఎలాంటి చర్యలకు దిగనున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: Thursday Special: ఈ స్తోత్రాలు వింటే మీకున్న దోషాలన్నీ ఈ రోజుతో తుడుచుకుపోతాయి
అయితే, ఇవాళ స్వయంగా స్పీకర్ ముందు హాజరుకానున్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. దీంతో, ఇవాళో.. రేపో ఫైనల్గా స్పీకర్ ఓ నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది.. నలుగరు రెబల్ ఎమ్మెల్యేలతో పాటు.. ప్రభుత్వ విప్ నుంచి అంటే.. మొత్తం ఐదుగురి నుంచి అనర్హత పిటిషన్లపై ఒకేసారి వివరణ తీసుకోనున్నారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఇప్పటికే తమపై వచ్చిన అనర్హత పిటిషన్లపై స్పీకర్కు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. అయితే, తనకు నోటీసులు అందలేదని చెప్పిరా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి.. ఈ విషయాన్ని స్పీకర్ కార్యాలయానికి మెమోరూపంలో తెలియజేశారు కోటంరెడ్డి.. ఇక, ముగ్గురు ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వగా.. తన ఫిర్యాదుపై ఆధారాలు సమర్పించారు చీఫ్ విప్ ప్రసాద్రాజు.. ఇవాళ వివరణ అనంతరం స్పీకర్ అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. తమపై ఉన్న అనర్హత పిటిషన్లు రద్దుచేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు రెబల్ ఎమ్మెల్యేలు.. తమకు ఉద్దేశ్యపూర్వకంగా అనర్హత నోటీసులు ఇచ్చారని.. తమ వాదన వినడానికి సమయం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏపీలో ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.. ఆ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజు వెలువడనుంది.. ఎన్నికలకు ఒక్కరోజు ముందే కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది.. మరోవైపు.. కోర్టు తీర్పునకు ముందే.. రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠ రేపుతోంది.