Ravindranath Reddy: కడప జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ముఖ్య నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా “వెన్నుపోటు దినం”గా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని కారణంగా ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన తెలిపారు. జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, స్థానిక అధికారులకు దీనిపై వినతి పత్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు.
Read Also: Bayya Sunny Yadav: యూట్యూబ్ భయ్యా సన్నీ యాదవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. పహల్గాం ఘటనకు ముందే..
అంతేకాకుండా రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. మోసాలకు, కుట్రలకు, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలను బలహీనపరిచే పని ఆయన ఎప్పుడూ చేస్తారు. ఎన్నికల హామీలు అన్ని అబద్ధాలు. సూపర్ సిక్స్ అని చెప్పిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను బయపెట్టి, బెదిరించి మహానాడుకి తరలించారు. ఇది మహానాడు కాదు.. అబ్బా కొడుకుల డబ్బా నాడు అంటూ ఘాటుగా స్పందించారు. ప్రజలకు ఏమీ మేలు చేయలేదు.. కేవలం జగన్ భజన తప్ప ఫలితాలేమీ లేవు.. కొత్తగా ‘ఆరు శాసనాలు’ అనే పేరుతో మరోసారి కట్టు కథలు వినిపిస్తున్నారని విమర్శించారు.
అలాగే ఇతర నాయకులతో పోలిస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ నాయకత్వం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందించడంలో మహానేత వైఎస్సార్ పాత్రను మరువలేం. తర్వాత ఆ స్థాయిని జగన్ అందుకున్నారు. కానీ, చంద్రబాబుని చెప్పుకుంటే ఒక్క మంచి పథకం కూడా గుర్తుకు రావడం లేదని ఎద్దేవా చేశారు. ఈ సమావేశం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలతో పాటు, జూన్ 4న జరగబోయే నిరసన కార్యక్రమాలకు రంగం సిద్ధం చేసినట్లు స్పష్టం చేసింది.