YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా విజయసాయిరెడ్డిపై, అలాగే రాష్ట్రంలోని లిక్కర్ స్కాంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ మాఫియా, డిస్టిలరీ ఆర్డర్లు, లిక్కర్ అమ్మకాలపై చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలను తెలిపారు. జగన్ మాట్లాడుతూ.. ఏ లిక్కర్ కంపెనీ డిస్టలరీ మేలు చేయాలో ప్రైవేట్ షాపుల పేరుతో వీళ్ళ ప్రైవేట్ సైన్యం ఇండెంట్ ప్లేస్ చేస్తారన్నారు. మా హయాంలో ఎప్పుడైనా ఇలా చూసారా? గత ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేశామా? అని ప్రశ్నించారు. అలాగే, ఎంపిక చేసిన డిస్టిలరీలకు ఇండెంట్ పెట్టి లంచాలు తీసుకుంటేనే పారదర్శకత కాదని చెప్పారు. తాము మాత్రం క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా పారదర్శకంగా మద్యం అమ్మినట్లు గుర్తు చేశారు. జగన్ వెల్లడించిన విషయాల్లో, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) తాము అమలు చేస్తున్న మద్యం విధానంపై పూర్తి స్థాయిలో సుదీర్ఘ విచారణ జరిపి, ప్రభుత్వ విధానం సహేతుకమని తీర్పు ఇచ్చిందని తెలిపారు. ‘‘జడ్జిమెంట్ కాపీ కూడా మా వద్ద ఉందని పేర్కొన్నారు.
Read Also: Sthree Nidhi App: పేదలకు 48 గంటల్లో రుణాల మంజూరు.. స్త్రీనిధి మొబైల్ యాప్ లాంచ్..!
ఇది ఇలా ఉండగా.. తనతోపాటు నిన్నమొన్నటి వరకు ఉన్న విజయసాయిరెడ్డిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు ప్రలోభాలకు విజయసాయిరెడ్డి లొంగిపోయారని అయన అన్నారు. ఇంకా మూడేళ్లకు పైగా రాజ్యసభ పదవీ కాలం ఉన్నా.. విజయసాయిరెడ్డి కేవలం కూటమికి ప్రయోజనం కలిగించేందుకే రాజీనామా చేశారని జగన్ ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్కు ఏమి విలువ ఉంటుంది? అంటూ జగన్ విమర్శించారు. అలాగే వాసుదేవరెడ్డిని బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారు. ఆయన వాంగ్మూలం ఇచ్చాకే సెంట్రల్ సర్వీస్కు పంపించారు. మిథున్ రెడ్డికి లిక్కర్ కేసుతో ఏమి సంబంధం? ఆయన తండ్రి ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా కాదని జగన్ వివరణ ఇచ్చారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పల అరెస్టులు రాజకీయ కక్షసాధింపు కోణంలో జరిగాయని అన్నారు.
Read Also: Jagan Mohan Reddy: రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు.. ప్రభుత్వంపై జగన్ ఫైర్..!
అలాగే పీఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్, సంజయ్ వంటి ఐపీఎస్ అధికారులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు. 199 మంది పోలీసులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారు అంటూ ప్రభుత్వయంత్రాంగం మీద మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో లిక్కర్ షాపులకు లాటరీ పేరుతో రిగ్గింగ్ జరిగిందని జగన్ ఆరోపించారు. ఇక ప్రస్తుతం కొత్త బ్రాండ్లు తీసుకువచ్చారు. ఊరు పేరు లేని బ్రాండ్లు.. చీపెస్ట్ చిప్ లిక్కర్ పక్క రాష్ట్రాల్లో కంటే పదిరూపాయలు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని.. గ్రామాల్లో ఎంఆర్పీ రేట్లకు మద్యం దొరకడం లేదని జగన్ మండిపడ్డారు. అలాగే, మద్యం వ్యాపారంలో తాము ఏ విధంగా పారదర్శకత పాటించామో వెల్లడించేందుకు సంబంధిత అన్ని డాక్యుమెంట్లు పబ్లిక్ డొమెయిన్లో పెడుతున్నాం అని తెలిపారు.