Wedding Season: వేసవి సీజన్ వచ్చిందంటే చాలు.. మగువ మనసు మల్లెపూల వైపే ఉంటుంది. అయితే మల్లెల సీజన్ వచ్చినా మల్లెపూల ధరలు మండిపోతున్నాయి. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో మల్లె ధరలు కొండెక్కాయి. వాసన చూద్దామంటే..మల్లెపువ్వు కరువైపోయిందంటున్నారు కోనసీమవాసులు. మల్లెపూలు సువాసనతో మత్తెక్కిస్తాయి. కానీ..పెరిగిన ధరలు వినియోగదారుడికి చెమటలు పట్టిస్తున్నాయి. కొందామంటేనే జనం హడలిపోయే పరిస్థితి నెలకొంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎండలే కాదు…మల్లెపూల ధరలు చెమటలు పట్టిస్తున్నాయి. హోల్సేల్ మార్కెట్లో కేజీ మల్లెపూల ధరలు వెయ్యి రూపాయల నుండి 12 వందలు పలుకుతున్నాయి. పూల ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు కొనాలంటేనే భయపడి పోతున్నారు. డిమాండ్కు సరిపడా సప్లై లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగాయి.
Read Also: Medaram Jathara: మరో రెండ్రోజుల్లో మహాజాతర.. భక్తులతో కిక్కిరిసిన మేడారం
మల్లెపూలకు పేరెన్నిక గల కృష్ణా జిల్లాలోని మైలవరం చండ్రగూడెంలో కేజీ రూ.1200గా ఉంది. మిచాంగ్ తుపానుతో దిగుబడి ఆలస్యం కావడంతో పాటు ఇప్పుడు రోజుకు సగటున 50 కేజీలు మాత్రమే వస్తుందని రైతులు వాపోతున్నారు. ఫలితంగా మంచి ధర ఉన్నా దిగుబడి లేకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. వేసవి కాలంలోనే లభించే పూలు కావడంతో మగువలు అధికంగా వీటిని ఇష్టపడతారు.