మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలతో పాటు టీఆర్ఎస్ పార్టీలకు అర్హత పరీక్షగా భావిస్తున్నారు నేతలు. అందుకే మునుగోడులో తమ పార్టీ జెండాను ఎగురవేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ తమ పార్టీ అభ్యర్థికి జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు కాంగ్రెస్ తరుఫున ప్రచారంలో పాల్గొనలేదు. ప్రచారానికి దూరంగా ఉండటంపై కూడా ఇటీవల క్లారిటీ ఇచ్చారు వెంకట్రెడ్డి. అయితే.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ హనుమంతరావు మాట్లాడుతూ.. రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నో త్యాగాలు చేశారని, అలాంటి వ్యక్తి ఎవరో తిట్టారని సైలెంట్ గా ఉండడం సరికాదన్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టీఆర్ఎస్ నేతలు కోవర్ట్ రెడ్డి అనడం బాధ కలిగించిందని, అధికార పార్టీ నాయకులతో ఇంటిపేరును కూడా మార్చేసి ఆరోపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. స్టార్ క్యాంపెయినర్గా ఉండి ప్రచారం చేయకపోతే మీకే చెడ్డ పేరు అని వెంకట్రెడ్డికి హితవు పలికారు. పార్టీలో నాక్కూడా అవమానాలు జరిగాయి కానీ కాంగ్రెస్ జెండాను వదిలిపెట్టలేదన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ అని చెబుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరంగా ఉండకూదని, రైతంగా సమస్యలపై రేవంత్ రెడ్డితో కలిసి ఉద్యమించిన నీవు యూనిటీని దెబ్బతీయద్దన్నారు. మునుగోడు ఉపఎన్నిక అయిపోయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళు అని, ప్రచారం చేయకుండా విదేశాలకెళితే ఎన్నారైలంతా నిన్ను ప్రశ్నిస్తారని ఆయన అన్నారు. సోనియా గాంధీ తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారని, సోనియాగాంధీ అంత చేస్తుంటే మనం ఇంకెంత చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.