తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం మారడం.. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కలత చెందిన ఆమె శుక్రవారం గవర్నర్కు తన రాజీనామా లేఖను పంపించారు. వ్యక్తుల కారణంగా వ్యవస్థపై మచ్చ పడిందని.. జరిగిన దుష్పరిణామాలకు సభ్యులుగా తమ ప్రమేయం ఏమీ లేదని.. అయినా కమిషన్ మార్పే ప్రక్షాళన అనే స్థాయిలో జరిగిన ప్రచారం తీవ్రంగా బాధించింది అని సుమిత్రానంద్ అన్నారు. ఉద్యోగ నామ సంవత్సరం అనుకున్న సంవత్సరమే ఎన్నికల సంవత్సరం కావడం వల్ల తాము ఉద్యోగ నియామక ప్రక్రియను సజావుగా జరపలేకపోయామని సుమిత్రానంద్ విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ పౌరసమాజంలో అసంతృప్తిగా ఉన్న వర్గం నిరుద్యోగులే అని గుర్తించిన నాటి ప్రభుత్వం సత్వరంగా ఉద్యోగ నియమకాలు చేపట్టాలని ఆ దిశలో అడుగులు వేసింది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు వివిధ పార్టీలు ఉద్యోగార్థుల పక్షం వహించి పరీక్షల వాయీదాల కోసం రకరకాలుగా ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచి గ్రూప్ -2 వాయిదా వేయించాయని తెలిపారు.
Praja Palana Sub-Committee: ఐదు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతాం..
లీకేజీ వంటి ఇతరాత్ర కారణాలు అన్నీ కలగలిపి కమిషన్ ప్రక్షాళన జరగాలి అనే ప్రచారం విస్తృత స్థాయిలో జరిగింది.. అసలు ప్రక్షాళన అనే పదం కమిషన్ ఉద్దేశించి వాడటంతో తాను తీవ్రంగా కలత చెందినట్లు సుమిత్రానంద్ పేర్కొన్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బీ. జనార్ధన్రెడ్డి, సభ్యులు బండి లింగారెడ్డి, ఆర్ సత్యనారాయణ, కారం రవీందర్రెడ్డిలు రాజీనామాలు సమర్పించారు. వీరి రాజీనామాలను ఇటీవలే గవర్నర్ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సుమిత్ర ఆనంద్ తనోబా శుక్రవారం టీఎస్పీఎస్సీ కార్యాలయానికి చేరుకుని, తన సిబ్బంది ద్వారా గవర్నర్కు రాజీనామా లేఖను పంపించారు. ప్రస్తుతం కోట్ల అరుణకుమారి ఒక్కరే కమిషన్ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. వృత్తిరీత్యా ప్రభుత్వ టీచర్ అయిన సుమిత్ర ఆనంద్ తనోబా టెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉపాధ్యాయులను సమీకరించి అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించారు.
భాషను అవమానిస్తున్న తీరు పట్ల కలతచెందిన ఆమె, తెలంగాణ యాసను కాపాడుకునేందుకు తెలంగాణ భాషా వేదికను నిర్వహించి పోరాడారు. తన మాటా పాటలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రజలలో ఉద్యమ ఆకాంక్షను పెంపొందించగలిగారు .తెలంగాణ రచయితల వేదిక లో క్రియాశీల పాత్రను పోషించారు అక్షరాస్యత, సారా నిషేదం, మధ్యపాన వ్యతిరేకోధ్యమం, బాల్య వివాహాలను అరికట్టేందుకు అనేక ఉద్యమాలను నిర్వహించారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్లలో పాల్గొన్నారు. మహిళగా ఆమె పోరాటాన్ని గుర్తించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టీఎస్పీఎస్సీ సభ్యురాలిగా అవకాశం కల్పించారు. పూర్తి పదవీ కాలం ఆరేండ్లు కమిషన్ సభ్యురాలిగా ఉండాల్సి ఉండగా, రెండున్నరేండ్లకే రాజీనామా చేశారు. నీళ్ళు నిధులు నియమకాలు అనే ప్రధాన డిమాండ్లతో సాగిన మలిదశ ఉద్యమం లో క్రీయశీల పాత్ర పోషించిన తనకు నియామక ప్రక్రియ లో పని చేసే అవకాశం కల్పించిన ఉద్యమ సారథి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు.