తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రాథమిక కీ విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన వివిధ సెంటర్లలో నిర్వహించిన ఎంసెట్ పరీక్షలు ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం రాత్రి 8గంటలకు ఎంసెట్ 2023 (ఇంజినీరింగ్ స్ట్రీమ్) పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేసింది తెలంగాణ ఉన్నత విద్యామండలి. ఈ నెల 12 నుంచి మూడు రోజుల పాటు ఆరు విడతల్లో నిర్వహించిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల రెస్పాన్స్ పత్రాలను సైతం వెబ్సైట్లో ఉంచారు. ఈ ప్రాథమిక కీపై ఈ నెల 17 రాత్రి 8గంటల వరకు అభ్యంతరాలను పంపొచ్చని అధికారులు సూచించారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు మొత్తం 2,05,351 మంది దరఖాస్తులు చేసుకోగా.. 1,95,275మంది(94.11శాతం) పరీక్షలు రాసినట్టు ఎంసెట్ కన్వీనర్ కార్యాలయం వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఈ నెల 10న మొదలైన ఎంసెట్ ప్రవేశ పరీక్షలు ఆదివారం ముగిశాయి. శుక్రవారం జరిగిన ఇంజనీరింగ్ పరీక్షకు 96 శాతం మంది(తెలుగు రాష్ట్రాల) అభ్యర్థులు హాజరైనట్లు ఎంసెట్ కో కన్వీనర్ విజయకుమార్రెడ్డి తెలిపారు. తెలంగాణలో 96.35 శాతం, ఆంధ్రప్రదేశ్లో 92.50 శాతం హాజరు నమోదైంది. హైదరాబాద్లో అత్యధికంగా 97శాతం మంది పరీక్ష రాశారు. ఈ నెల 10, 11 తేదీల్లో అగ్రికల్చర్.. 12, 13, 14 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలను నిర్వహించారు. అయితే.. అగ్రికల్చర్ ప్రిలిమినరీ కీ ని ఆదివారం అందుబాటులోకి తీసుకొచ్చారు.