భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత.. చైనా విదేశాంగ మంత్రి కీలక ప్రకటన..
భారతదేశం, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతకు సంబంధించి చైనా ప్రకటన వెలువడింది. పాకిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో తాము అండగా నిలుస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్యీ అన్నారు. ఈ మేరక తాజాగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ ఫోన్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో చైనా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వాంగ్యీకు పాక్ మంత్రి వివరించినట్లు విదేశాంగశాఖ కార్యాలయం వెల్లడించింది.
‘కుక్క తోకర వంకర’.. పాక్ దాడిపై సెహ్వాగ్ సంచలన ట్వీట్
అమెరికా అధ్యక్షుడు అధికారికంగా భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత.. పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. శ్రీనగర్ సహా అనేక భారతీయ ప్రాంతాలలో డ్రోన్లు కనిపించాయి. శ్రీనగర్, రాజస్థాన్, గుజారాత్ రాష్ట్రంలోని బార్డర్లలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కఠినమైన వైఖరి తీసుకుంది. పాకిస్థాన్ను తిప్పికొట్టాలని నిర్ణయించింది. కాగా.. మాజీ క్రికెటర్ సెహ్వాగ్ సంచలన ట్వీట్ చేశారు. పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై వీరేంద్ర సెహ్వాగ్ పరోక్షంగా స్పందించారు. ‘కుక్క తోకర వంకర’ అని రాసి ఉన్న హిందీ సామెతను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది. మరోవైపు.. పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించడంపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత మొదలైంది. ఈ అంశంపై భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పందించారు.
పాకిస్థాన్ కాల్పుల్లో ఎస్ఐ మహ్మద్ ఇంతియాజ్ వీరమరణం..
జమ్మూ కశ్మీర్లోని పాకిస్థాన్ సరిహద్దులో జరిగిన క్రాస్ కాల్పుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్)కి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ అమరులయ్యారు. బీఎస్ఎఫ్ ట్వీట్ ద్వారా ఆయన బలిదానాన్ని ధృవీకరించింది. మహ్మద్ ఇంతియాజ్ అత్యున్నత త్యాగానికి వందనం సమర్పించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. మే 8 మరియు 9 తేదీల మధ్య రాత్రి జరిగిన షెల్లింగ్లో మహ్మద్ ఇంతియాజ్ గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శనివారం రాత్రి అమరులైనట్లు తెలుస్తోంది. “మే 10, 2025న జమ్మూ జిల్లా ఆర్ఎస్ పురా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు కాల్పుల సమయంలో దేశ సేవలో బీఎస్ఎఫ్కు చెందిన ధైర్యవంతుడు సబ్-ఇన్స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ చేసిన అత్యున్నత త్యాగానికి మేము సెల్యూట్ చేస్తున్నాం. బీఎస్ఎఫ్ సరిహద్దు పోస్టుకు నాయకత్వం వహిస్తూ, ముందు వరుసలో ధైర్యంగా నాయకత్వం వహించారు” అని బీఎస్ఎఫ్ ట్వీట్లో పేర్కొంది.
పాక్- భారత్ వివాదం.. అజిత్ దోవల్తో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి!
పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో భారత సిబ్బందిలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని, ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దోవల్ పేర్కొన్నారు. యుద్ధం భారత్ తమ ఛాయిస్ కాదని ఆయన నొక్కి చెప్పారు. అజిత్ దోవల్ వివరణపై స్పందించిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడారు. “పహల్గాం ఉగ్రదాడిని చైనా ఖండిస్తుంది. అన్నిరకాల ఉగ్రవాదాన్ని చైనా వ్యతిరేకిస్తుంది. భారత్, పాక్ రెండూ చైనా పొరుగు దేశాలు. ఇరుదేశాలు ప్రశాంతంగా, సంయమనంతో ఉంటాయని, చర్చలు, సంప్రదింపులు ద్వారా విభేదాలను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నాం. భారత్-పాక్ల మధ్య శాశ్వత కాల్పుల విరమణకు చైనా మద్దతు ఉంటుంది” అని అన్నారు.
భారత్లోకి చొరబడేందుకు పాక్ యత్నం.. తిప్పికొట్టిన సైన్యం!
సరిహద్దుల్లో నగ్రోటా వద్ద చొరబాటుకు పాక్ యత్నించింది. పాక్ చొరబాటుదారులపై భారత రక్షణ దళం కాల్పులు జరిపింది. చొరబాటు దారులు సైతం కాల్పులు జరపగా.. ఓ ఇండియన్ ఆర్మీ జవాను గాయపడ్డారు. ప్రస్తుతం రక్షణా దళాలు చొరబాటుదారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ విషయాన్ని భారత సైన్యం వైట్ నైట్ కార్ప్స్ ట్వీట్ ద్వారా తెలియజేసింది. ఎల్వోసీ దగ్గర అనుమానాస్పద కార్యకలాపాలను గమనించిన, నగ్రోటా మిలిటరీ స్టేషన్ అప్రమత్తంది. సరిహద్దు దాటి చొరబాటుకు యత్నిస్తున్న వారిని భారత సెంట్రీ గుర్తించారు. దీని తరువాత, అనుమానితుడితో కొద్దిసేపు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సెంట్రీకి స్వల్ప గాయాలయ్యాయి. ఈ హఠాత్ పరిణామంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. చొరబాటుదారులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మేము కాల్పుల విరమణను ఉల్లంఘించలేదు.. పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ
పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కాల్పుల విరమణ ఉల్లంఘనను వార్తలను ఖండించింది. పూర్తి నిజాయితీతో కాల్పుల విరమణను అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అయితే.. భారతదేశం వైపు నుంచి ఉల్లంఘన సంఘటనలు జరిగాయని ఆరోపించింది. వాటిని పాకిస్థాన్ సైన్యం బాధ్యతాయుతంగా, సంయమనంతో నిర్వహించిందని పేర్కొంది. కాల్పుల విరమణ సజావుగా అమలు చేయడంలో ఏమైనా సమస్యలు తలెత్తే.. చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొంది.
షాకింగ్.. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ను నిషేధించిన యూనస్ ప్రభుత్వం!
బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం, పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య తాత్కాలిక ప్రభుత్వం శనివారం ఒక పెద్ద అడుగు వేసింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్పై నిషేధం ప్రకటించింది. ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే ఉద్దేశ్యంతో ఈ నిషేధం విధించినట్లు చెబుతున్నారు. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్లో అవామీ లీగ్, దాని నాయకులపై జరుగుతున్న విచారణ పూర్తయ్యే వరకు అమలులో ఉంటుందని ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయాన్ని సలహా మండలి (క్యాబినెట్) సమావేశంలో ఆమోదించారు.
పాక్ దాడిలో మరో భారత జవాన్ వీరమరణం..
శనివారం ఉదయం భారత్లోని అనేక ప్రాంతాలలో పాకిస్థాన్ డ్రోన్ దాడులను నిర్వహించింది. జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో ఉన్న వైమానిక దళ స్టేషన్ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే.. భారత సైన్యం, రక్షణ వ్యవస్థ శత్రు డ్రోన్ను గాల్లోనే కూల్చివేశాయి. ఈ సమయంలో వైమానిక దళ స్టేషన్లో విధుల్లో ఉన్న ఒక సైనికుడు వీరమరణం పొందాడు. పాకిస్థాన్ డ్రోన్ ముక్కను ఢీకొట్టడంతో అమరుడయ్యారు. ఈ అమరవీరుడి పేరు సురేంద్ర సింగ్ మోగా. అతను రాజస్థాన్లోని ఝుంఝును నివాసి. ఉధంపూర్ వైమానిక దళ స్టేషన్లో విధుల్లో నిర్వహించారు. ఉదయం పాకిస్థాన్ డ్రోన్ దాడి చేసింది. భారత వాయు రక్షణ వ్యవస్థ డ్రోన్ను గాల్లోనే విజయవంతంగా ధ్వంసం చేసిందని అధికారులు తెలిపారు. కానీ శిథిలాల జవాన్ సురేంద్ర సింగ్ను ఢికొట్టాయి. అతను తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ మరణించాడు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ అమరవీరుడైన సైనికుడికి నివాళులర్పించి, ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.
అమృత్సర్లో కొనసాగుతున్న హైఅలర్ట్.. ప్రజలకు ప్రభుత్వ కీలక సూచనలు!
పంజాబ్ అమృత్సర్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. ప్రభుత్వం మరోసారి ప్రజలకు కీలక సూచనలు చేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలని.. దయచేసి ఇళ్లలో లైట్లు ఆపి, కిటికీలకు దూరంగా ఇంటి లోపల ఉండాలని సూచించింది. దయచేసి రోడ్డు, బాల్కనీ లేదా టెర్రస్పైకి వెళ్లవద్దని తెలిపింది. భయపడవద్దని.. సాధారణ కార్యకలాపాలను ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తామో తెలియజేస్తామని ప్రకటించింది. ఈ సమాచారాన్ని అమృత్సర్ డీసీ ఉదయం 4.39 గంటలకు జారీ చేసిన మార్గదర్శకంలో తెలిపింది. భారత్లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ డ్రోన్ దాడులకు తెగబడుతోంది. శనివారం తెల్లవారుజామున అమృత్సర్లోని ఖాసా కంటోన్మెంట్ గగనతలంలో భద్రతా బలగాలు శత్రు డ్రోన్ను గుర్తించాయని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. వైమానిక రక్షణ విభాగాలు వెంటనే దాన్ని కూల్చివేశాయని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను, చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా.. కాల్పుల విరమణ అనంతరం కూడా అమృత్సర్లో రాత్రి డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. గత రెండ్రోజులుగా అమృత్సర్ పరిసరాల్లో వరుసగా మిస్సైల్ శకలాలు లభ్యం అవుతుండటంతో ప్రజలు భయాందోళలనకు గురవుతున్నారు.
అధికారిక లాంఛనాలతో.. నేడు వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు
గత నాలుగు రోజులుగా క్షణ క్షణం టెన్షన్ వాతావరణం నెలకొంది. భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. పాక్ పై భారత సైన్యం విరుచుకుపడింది. పాక్ ను కోలుకోలేని దెబ్బకొట్టింది. భారత్ పాక్ వార్ లో తెలుగు జవాన్ మురళీ నాయక్ తో పాటు మరో ఇద్దరు వీరమరణం పొందారు. ఏపీ(AP)లోని సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన మురళీ నాయక్ జమ్ము కశ్మీరులోని LOC వద్ద పాకిస్తాన్ తో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ భౌతికకాయం నిన్న సొంతూరికి చేరింది.