*తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మంత్రివర్గ కూర్పు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదివరకే కొన్ని హామీలు అమలు చేయగా, మరికొన్ని హామీల అమలుతో పాటు పాలనలో తమదైన మార్క్ చూపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం అమలును సమీక్షించి, పర్యవేక్షించనున్నారు.
తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం
1.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి – కరీంనగర్
2.దుద్దిళ్ల శ్రీధర్ బాబు – రంగారెడ్డి
3.పొన్నం ప్రభాకర్ – హైదరాబాద్
4.దామోదర రాజనరసింహ – మహబూబ్ నగర్
5.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – ఖమ్మం
6.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – వరంగల్
7.కొండా సురేఖ – మెదక్
8.అనసూయ సీతక్క – ఆదిలాబాద్
9.తుమ్మల నాగేశ్వర రావు – నల్గొండ
10.జూపాల్లి కృష్ణారావు – నిజామాబాద్
*తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్లు, ఒక ఐపీఎస్ బదిలీ
తెలంగాణలో ఏడుగురు సివిల్ సర్వెంట్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వారిలో ఆరుగురు ఐఏఎస్లు, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం బదిలీల ఉత్తర్వలను జారీ చేసింది. ట్రాన్స్పోర్టు కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాశ్, ఎక్సైజ్ కమిషనర్గా ఇ.శ్రీధర్ను నియమించింది. అలాగే టీఎస్ఐఐసీ ఎండీగా ఇ.శ్రీధర్కు అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. పౌరసరఫరాల కమిషనర్గా దేవేంద్ర సింగ్ చౌహాన్(ఐపీఎస్)కు బాధ్యతలు అప్పగించింది. ఇంటర్ విద్య డైరెక్టర్గా శ్రుతి ఓజా, గిరిజ సంక్షేమ డైరెక్టర్గా ఈవీ నర్సింహారెడ్డిని నియమించారు. ఇక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలికేరిపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం ఆమెకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. జేఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. భారతి స్థానంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా గౌతమ్ పొత్రుకు బాధ్యతలు అప్పగించింది. ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా, గిరిజన సంక్షేమ డైరెక్టర్గా ఈవీ నర్సింహారెడ్డిని నియమించింది.
*అధికారుల అలసత్వాన్ని సహించం.. కలెక్టర్లకు హెచ్చరిక
కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనకు అనుగుణంగా అధికారుల పనితీరు ఉండాలే తప్పా విధుల్లో అలసత్వం వహిస్తే సహించమన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఆదివారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ప్రభుత్వ ఉద్దేశాలపై దశా దిశా నిర్దేశం చేశారు. రాబోయే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజా పాలన అందించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో అధికారులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలం తర్వాత ప్రజల ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, కలలు నెరవేరాలని కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా ప్రజలు కోరుకున్న ఆశలు ఆకాంక్షలు నెరవేరలేదు. వారి కలలు నేరవేరకపోవడంతో ప్రజలు మార్పును కోరుకుని ప్రజా (కాంగ్రెస్) ప్రభుత్వం తెచ్చుకున్నారని వివరించారు. ప్రజలు తెచ్చుకున్న ఈ ప్రభుత్వం నాది అన్న నమ్మకం భరోసా కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని, అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం పనితీరు ఉండాలని హిత బోధ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగానే అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేశామని చెప్పారు. రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించడం పట్ల వారు ఎంతో సంతోషంగా ఉన్నారని ఈ పథకం సక్సెస్ ఫుల్గా అమలవుతుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రతి పేదవాడికి కార్పొరేట్ లో మెరుగైన వైద్యం అందించాలని ప్రధానమైన సంకల్పంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచామని దీని ద్వారా పేదలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. మిగత గ్యారెంటీలను కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తొలి వంద రోజుల్లోగా కచ్చితంగా అమలు చేస్తామని, ఇందులో ఎలాంటి మార్పులు లేవని, అనుమానాలు కూడా అవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే గ్యారంటీల హామీలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి లబ్ధిదారునికి అందించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరే విధంగా అధికారుల పాలన ఉండాలన్నారు. పాత ప్రభుత్వంలో పనిచేసిన పద్ధతిని కొంత మంది అధికారులు మార్చుకోవాలని ఆ మైండ్ సెట్ ఇకముందు ఉండకూడదని అన్నారు.
*తెలంగాణలో విజయం తర్వాత ఏపీపై రాహుల్ దృష్టి.. ఈ నెల 27న కీలక భేటీ
ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. తెలంగాణలో విజయం తర్వాత ఏపీపై రాహుల్ గాంధీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏపీలో కూడా పుంజుకుని పునరుత్తేజం వచ్చేలా కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా పయనించేందుకు గానూ ఏపీలోని కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతోంది కాంగ్రెస్ అధిష్ఠానం. అందుకోసం అడపాదడపా సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నెల 27న కాంగ్రెస్ అధిష్ఠానంతో ఏపీ కాంగ్రెస్ నేతల కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్, సీడబ్ల్యుసీ సభ్యుడు రఘువీరా రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, చింతా మోహన్, కొప్పుల రాజు, జేడీ శీలం తదితర సీనియర్ నాయకులు హాజరుకానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏపీ పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశంలో ఏపీ సీనియర్ కాంగ్రెస్ నేతలంతా పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలు, ఏపీలో పొత్తులపై నిర్ణయం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజం చేసేలా అధిష్ఠానం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
*ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. రన్నింగ్లో ఊడిపోయిన టైరు
హన్మకొండలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. 80 మంది ప్రయాణికులతో బస్సు రన్నీంగ్లో ఉండగా బస్సు టైర్ ఊడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కరీంనగర్-వరంగల్ జాతీయ ప్రధాన రహదారిపై ఆదివారం హుజరాబాద్ నుండి హనుమకొండ వైపు పల్లె వెలుగు బస్సు బయలుదేరింది. ఈ నేపథ్యంలో హన్మకొండ ఎల్కతుర్తి సమీపంలో బస్సు వెనక టైరు ఊడిపోయింది. దీంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించిన బస్సు ప్రమాదం భారీన పడకుండ చూశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉండగా పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు. అయితే ఓవర్ లోడ్ కారణంగా బస్సు టైర్ ఊడిపోయినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
*క్రైస్తవ సోదర, సోదరీమణులకు సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ప్రభువైన ఏసు క్రీస్తును భక్తిశ్రద్ధలతో ఆరాధించేందుకు క్రైస్తవులు సంసిద్ధమవుతున్నారు. క్రిస్మస్ పండుగలో ప్రధాన పాత్ర పోషించే స్టార్లు, క్రిస్మస్ ట్రీల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సర్వ మానవాళిని పాప విముక్తుల్ని గావించేందుకు దైవ కుమారుడైన ఏసుక్రీస్తు భూమిపై అవతరించిన డిసెంబర్ 25ను క్రిస్మస్ పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సందడి నెలకొంది. ఇప్పటికే చర్చిలను విద్యుత్ కాంతులతో అందంగా ముస్తాబు చేశారు. కేకులు, స్వీట్లు అమ్మకాలు ఊపందుకున్నాయి. క్రిస్మస్ పండుగలు ప్రధాన పాత్ర వహించే స్టార్లు, ట్రీలు కొనుగోలు చేసేందుకు క్రైస్తవులు ఆసక్తి చూపారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులు అందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. ఏసుప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని, తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని ముఖ్యమంత్రి అన్నారు.ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలకు ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
*”అయోధ్య రాముడి” నినాదంతో లోక్సభ ఎన్నికలకు బీజేపీ ప్లాన్..
వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ సిద్ధమవుతోంది. మూడోసారి వరసగా అధికారంలోకి వచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 50 శాతం ఓట్లను పొందడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే తన పార్టీ కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేసింది. జనవరి 22, 2024లో అయోధ్యంలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. మోడీ హయాంలో ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ నెరవేరబోతోంది. అయితే అయోధ్య రామమందిర ప్రతిష్టాపనను సద్వినియోగం చేసుకోవాలని పార్టీ, కార్యకర్తలను కోరింది. పార్టీ ఆఫీస్ బేరర్లతో ఇటీవల బీజేపీ రెండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు వ్యూహాలను గురించి చర్చించారు. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. వీరు పార్టీ శ్రేణులకు బలమైన సందేశాన్ని ఇచ్చారు. రామ మందిర ప్రతిష్టాపన వేడుకలనే బీజేపీ విజయానికి మూలస్తంభంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వేడుకలను ఎన్నికల ప్రచారం అంశంలో సమర్థవంతంగా ఉపయోగించుకుని ఓట్లు రాబట్టేందుకు వ్యూహాలను సిద్ధం చేసింది. రామ మందిర ఉద్యమం, ఆలయ నిర్మాణంలో బీజేపీ పాత్రను తెలియజేసేలా బుక్లెట్ విడుదల చేయనున్నారు. కొత్త ఓటర్లను కనెక్ట్ కావడానికి, వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు బూత్ స్థాయి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తమ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష పార్టీలు ఆలయ నిర్మాణాన్ని ఎలా అడ్డుకోవడానికి ప్రయత్నించాయనే విషయాన్ని కూడా బీజేపీ హైలెట్ చేయనుంది. రామ మందిరానికి సంబంధించి ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) నిర్వహించే అన్ని కార్యక్రమాలకు బీజేపీ మద్దతు ఇవ్వనుంది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో, బీజేపీ అధిక మార్జిన్తో విజయం సాధించడమే టార్గెట్గా పెట్టుకోవాలని ఆఫీస్ బేరర్లకు అమిత్ షా సూచించారు. అధిక తేడాతో గెలుస్తామని నిర్ధారించుకోవాలని, దీంతో ప్రతిపక్షాలు బీజేపీ ముందు నిలబడేందుకు ధైర్యం చేయవని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్లో బలంగా ఉన్నాము, ఇతర చోట్ల బలహీనంగా ఉన్నామనే భావన వదిలేయాలని, బలహీనమైన స్థానాలు ఏమీ లేవని ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది. ఇదిలా ఉంటే ఎన్నికల కంటే చాలా ముందుగానే ఎన్నికల్లో బలహీనంగా ఉన్న స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది.
*రెజ్లింగ్ బాధ్యతలు ఇండియన్ ఒలింపిక్ చేతుల్లోకి.. ప్యానల్ ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశం..
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు కావడాన్ని రెజ్లర్లు తట్టుకోలేకపోతున్నారు. ఆయన విజయంపై ఏస్ రెజ్లర్ సాక్షి మాలిక్ రెజ్లింగ్ కెరీర్కి గుడ్ బై చెప్పింది. రెజ్లర్లు బజరంగ్ పునియా, విజేందర్ సింగ్ వంటి వారు తమ పద్మ శ్రీ అవార్డులను తిరిగి ప్రభుత్వానికి వాపస్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఈ రోజు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ డబ్ల్యూఎఫ్ఐ పాలక వర్గాన్ని సస్పెండ్ చేసింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) నిర్వహణకు తాత్కాలిక ప్యానెల్ను ఏర్పాటు చేయాల్సిందిగా క్రీడా మంత్రిత్వ శాఖ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)ని కోరింది. తాత్కాలిక కమిటీ అథ్లెట్ల ఎంపికతో పాటు డబ్ల్యూఎఫ్ఐ వ్యవహారాలను నిర్వహించగలదు, నియంత్రించగలదని ఐఓఏకి రాసిన లేఖలో పేర్కొంది. డబ్ల్యూఎఫ్ఐ మాజీ ఆఫీస్ బేరర్ల ప్రభావం, నియంత్రణ నుంచి ఎదురయ్యే సవాళ్లలో డబ్ల్యూఎఫ్ఐ పాలన, సమగ్రత గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తాయి అని సెంట్రల్ అండర్ సెక్రటరీ తరుణ్ పరీక్ సంతకంతో ఉన్న లేఖ పేర్కొంది.