రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి:
ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నేత పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు.. ఏపీ శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి తమ నామినేషన్ పత్రాలను అందించారు పాకా సత్యనారాయణ.. నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. తదితర ఇతర నేతలు పాల్గొన్నారు.. ఇక, నామినేషన్ వేసిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాద పూర్వకంగా కలిశారు కూటమి రాజ్యసభ అభ్యర్థి పాకా సత్యనారాయణ… బీజేపీతో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎంకు వివరించారు.. కొద్దిసేపు తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగింది.. ఈ సమావేశంలో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస వర్మ ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
మీరే సర్వం.. మీరే పార్టీ:
జిల్లాల్లో మీరే సర్వం.. మీరే పార్టీ.. పార్టీయే మీరు.. అంతే కాదు జిల్లాల్లో అన్నిస్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత కూడా మీదే అంటూ జిల్లా అధ్యక్షులపై కీలక బాధ్యతలు మోసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. వైసీపీ జిల్లా అధ్యక్షులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమైన జగన్.. పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తూ.. కీలక సూచనలు చేశారు.. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతోంది.. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతాకాదు.. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్నిరంగాల్లోనూ విధ్వంసమే.. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది.. మద్దతు ధరలు దొరక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వివిధ జిల్లాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు.. అయితే, రైతుల తరఫున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది.. ఆ మేరకు జిల్లాల్లో రైతులకు అండగా ఉండాలి.. రైతుల డిమాండ్లపై పోరాటం చేయాలి. వీటిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలి అని సూచించారు.
రేపు విజయవాడకు తెలంగాణ సీఎం:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బుధవారం రోజు విజయవాడ వెళ్లనున్నారు.. బెజవాడలో జరగనున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు వివాహానికి హాజరు కాబోతున్నారు రేవంత్ రెడ్డి.. ఇక, విజయవాడ పర్యటన కోసం ఉదయం 9.15 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు.. ఉదయం 10.40 గంటలకు కానూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణానికి చేరుకుంటారు.. ఉదయం 10.50 గంటల నుండి 11.30 గంటల వరకు అయన కల్యాణ మండపం నందు.. దేవినేని ఉమా కుమారుడు వివాహానికి హాజరై.. వధూవరులను ఆశీర్వదించనున్నారు.. విజయవాడ నుంచి తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
పవన్ కళ్యాణ్ పై ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు:
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులు పాక్ పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లండి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎంపీ చామల మాట్లాడుతూ.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజలు గమనించాలని కోరారు. ప్రజలు ఉప ముఖ్యమంత్రిని చేసినపుడు నాయకుడు అనేవాడు ఆలోచించి మాట్లాడాలన్నారు.
మరోసారి డ్రగ్స్ కలకలం:
డ్రగ్స్ యువత జీవితాలను చిత్తు చేస్తోంది. మాదకద్రవ్యాల కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడడం లేదు. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, నల్లకుంటా పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.1.40కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నగర అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్,నల్లకుంటా పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారని తెలిపారు. వినియోగదారులు పేడ్లర్లుగా మారుతున్నారన్నారు. నల్లకుంటలో దాడులు నిర్వహించి డ్రగ్ పేడ్లర్ హర్షవర్ధన్, సప్లయ్ కం పేడ్లర్ శ్రీనివాస రాహుల్ లోకల్ పేడ్లర్స్ అభిషేక్, దవల్ ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. డార్క్ వెబ్ ద్వారా పరిచయాలు పెంచుకుని పేడ్లర్ గా అభిషేక్ మారాడని వెల్లడించారు.
టెన్త్ పరీక్ష ఫలితాలు వచ్చేస్తున్నాయ్:
తెలంగాణలో టెన్త్ ఫలితాల విడుదలపై ఉత్కంఠత వీడింది. పదవ తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధం అయింది. రిజల్ట్స్ రిలీజ్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. టెన్త్ ఫలితాలను రేపు అనగా 30 ఏప్రిల్ 2025న విడుదల చేయనున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.
కాంగ్రెస్కి పాకిస్తాన్ నుంచి ఆదేశాలు.. బీజేపీ విమర్శలు:
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయం మొదలైంది. కాంగ్రెస్ ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ..‘‘అవసరమైన సమయాల్లో మిస్ అవుతారు’’ అని కామెంట్ చేసింది. ప్రధానిని సూచించే ఒక ఫోటోని పోస్ట్ చేసి, దానికి తల లేకుండా ఉంచింది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అఖిల పక్ష సమావేశానికి ప్రధాని మోడీ గైర్హాజరు కావడాన్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎత్తిచూపారు. కాంగ్రెస్ నేతల కామెంట్స్పై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్తో కుమ్మకైందని, రాహుల్ గాంధీ రహస్య వ్యూహాల మేరకు ఇలా చేస్తున్నారని అన్నారు. గతంలో ప్రధాని మోడీ చేసిన ‘‘రక్తం నీరు కలిసి ప్రవహించలేదు’’ అనే వ్యాఖ్యల్ని ఠాకూర్ గుర్తు చేశారు. ‘‘కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు పాకిస్తాన్ భాష మాట్లాడటం, పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం నాకు అర్థం కాదు. భారతీయుల్ని చంపినప్పుడు వారి రక్తం మరగదా..? ప్రతీకారం తీర్చుకోవాలని అనిపించదా..?’’ అని ప్రశ్నించారు.
ఎగ్జిట్ గేట్ వద్ద కాల్పులు, ఎంట్రీ గేట్ వైపు టూరిస్టుల పరుగులు:
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా పథకం ప్రకారమే, టెర్రరిస్టులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడిలో ప్రాణాలతో బయటపడిన వారు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో ఉగ్రవాదుల కుట్ర వెలుగులోకి వచ్చింది. తప్పించుకోవడానికి మార్గం లేకుండా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఉగ్రవాదులు ఎంట్రీ గేట్ నుంచి రాగా, ఒకరు ఎగ్జిట్ గేట్ నుంచి వచ్చారు. నాలుగో ఉగ్రవాది వీరికి సపోర్ట్ చేయడానికి అడవిలో దాగి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఉగ్రవాదులు ఇద్దరు సైనిక దస్తులు ధరించగా, మూడో వ్యక్తి సంప్రదాయ కాశ్మీరీ ఫెరాన్ ధరించి ఉన్నాడు. ముందుగా కాల్పులు ఎగ్జిట్ గేట్ వద్ద ప్రారంభమయ్యాయి. దీంతో ఒక్కసారిగా పర్యాటకులు ఎంట్రీ గేట్ వైపు పరిగేత్తారు. అక్కడే కాపుకాసిన ఇద్దరు ఉగ్రవాదులు వీరిపై ఆకస్మికంగా దాడి చేశారు. ఎంట్రీ గేట్ వద్ద ఉగ్రవాదులు టూరిస్టుల్ని అదుపులోకి తీసుకుని మహిళల్ని, పరుషుల్ని వేరు చేశారు. ఆ తర్వాత హిందువులు, ముస్లింలుగా వేరు చేశారు. ఆ తర్వాత కాల్పులు జరిపే ముందు కల్మా చదవాలని ఉగ్రవాదులు కోరారు. ఎంట్రీ గేట్ వద్దకు వచ్చిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ని టెర్రరిస్టులు మొదటగా కాల్చి చంపారు.
కెనడాలో లిబరల్స్ ఘన విజయం.. ప్రధానిగా మార్క్ కార్నీ:
కెనడా ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ వరసగా మూడోసారి ఘన విజయం సాధించి, అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు తీసుకోనున్నారు. కెనడా పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో మొత్తం 343 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే 172 మంది సభ్యులు అవసరం. అయితే, లిబరల్ పార్టీ 168 స్థానాలు, కన్జర్వేటివ్ పార్టీ 144 స్థానాలను గెలుచుకున్నాయి. చిన్నాచితకా పార్టీలు కలిసి మిగిలి స్థానాల్లో విజయం సాధించాయి. అధికారానికి కేవలం 4 సీట్ల దూరంలో లిబరల్ పార్టీ ఆగిపోయినప్పటికీ, ఇతరులు మద్దతు ఖచ్చితంగా ఉండటంతో మరోసారి అధికారాన్ని చేపట్టబోతోంది. నిజానికి, ప్రధానిగా జస్టిన్ ట్రూడో ఉన్న సమయంలో లిబరల్ పార్టీ అధికారంలోకి రాదని అంతా అనుకున్నారు. అయితే, ఆయన ప్రధాని పదవికి, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికల ముందు మార్క్ కార్నీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కార్నీ నేతృత్వంలో లిబరల్ పార్టీ సత్తా చాటింది.
పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ “ఎక్స్” అకౌంట్పై నిషేధం:
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడి భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల్ని పెంచింది. 26 మంది అమాయకపు టూరిస్టుల్ని లష్కరే తోయిబా ఫ్రాక్సీ ‘‘ది రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులు కాల్చి చంపారు. మతం ఆధారంగా మారణహోమానికి పాల్పడ్డారు. అయితే, ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. దాడిలో ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు పాల్గొన్నారు. ఇప్పటికే, భారత్ పాకిస్తాన్పై దౌత్య చర్యలు మొదలుపెట్టింది. పాక్ జీవనాడి అయిన సింధు నదికి సంబంధించి ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంది.
ఓటీటీలోకి వెంకీ మామ హీరోయిన్ కొత్త సినిమా:
హనుమాన్ మీడియా బ్యానర్పై నిర్మాత బాలు చరణ్ గతంలో సూపర్ మాచి, శాకాహారి, కాళరాత్రి, నేనే నా, కాజల్ కార్తీక, టీనేజర్స్, కథ కంచికి మనం ఇంటికి వంటి విజయవంతమైన తెలుగు చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు తమిళంలో సస్పెన్స్ థ్రిల్లర్గా బ్లాక్బస్టర్ విజయం సాధించిన ఆరత్తు సీనం చిత్రాన్ని తెలుగులో గరుడ 2.0 పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో డిమోంటి కాలనీ హీరో అరుళ్ నీతి తమిళరాజు, సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, ఐశ్వర్య దత్తా హీరో, హీరోయిన్లుగా నటించారు. తమిళంలో బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ చిత్రాన్ని నిర్మాత బాలు చరణ్ తెలుగులో గరుడ 2.0గా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.
కిష్కింధపురి’ గ్లింప్స్:
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న 11వ సినిమా కిష్కంధపురి. ఈ సారి హర్రర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని కౌశిక్ పెగల్లపాటి డైరెక్ట్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీని పూర్తి స్థాయి హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఫస్ట్ గ్లింప్స్ లో ఓ పాడుబడ్డ ఇంటిలోకి హీరో శ్రీనివాస్ ఇంకొంత మంది వెళ్తున్నట్టు కనిపిస్తోంది. రెండు, మూడు సార్లు ఆ డోర్ తాళం పగలగొట్టేందుకు ప్రయత్నిస్తుంటే.. స్క్రీన్ మీద కొన్ని డోర్లను ముట్టుకోవద్దు అని వస్తుంది. ఆ తర్వాత వారంతా లోపలకు వెళ్తుంటే కొన్ని చోట్లకు వెళ్లొద్దు అని స్క్రీన్ మీద వస్తుంది.
వైభవ్ సూర్యవంశీ హోంవర్క్ చేస్తున్న ద్రవిడ్:
14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ సంబరాలు చేసుకున్నారు. గాయాన్ని మరిచిన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. మరోవైపు వైభవ్కు స్టేడియంలోని ప్రేక్షకులంతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అయితే ఈ మ్యాచ్లో ద్రవిడ్కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైభవ్ బ్యాటింగ్ చేస్తుండగా.. ద్రవిడ్ తన నోట్ బుక్స్లో ఏదో రాస్తూ కెమెరాకు చిక్కాడు. వైభవ్ బ్యాటింగ్ లోపాలను ది వాల్ నోట్ చేసుకుంటున్నాడు. ఈ ఫొటో నెట్టింట వైరల్ కాగా.. ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ‘వైభవ్ హోంవర్క్ ద్రవిడ్ చేస్తున్నాడు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఒక్క సెంచరీ.. 8 రికార్డులు:
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్.. 35 బంతుల్లో సెంచరీ చేశాడు. మొత్తంగా 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101 పరుగులు చేసి ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ ఒక్క సెంచరీతో వైభవ్ ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. అవేంటో ఓసారి చూద్దాం.
# ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత బ్యాటర్
# ఐపీఎల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడు
# ఐపీఎల్లో ఓ ఇన్నింగ్స్లో ఎక్కువ సిక్స్లు (11) కొట్టిన భారత బ్యాటర్ (మురళీ విజయ్తో సమానంగా)
# ఐపీఎల్లో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)
# ఐపీఎల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)
# ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (17 బంతుల్లో)
# ఐపీఎల్లో అతి పిన్న వయసులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాడు
# టీ20 క్రికెట్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)