మూసి పునరుజ్జీవం చేస్తామంటే.. బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటోంది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ లో పర్యటిస్తు్న్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో జపాన్ లో ఉన్న తెలంగాణ వాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “తెలంగాణలో పరిశ్రమలు రావాల్సి ఉంది.. మన దగ్గర భూమి సరిపడా ఉంది.. పరిశ్రమల్ని ఆహ్వానిస్తున్నాం.. గుజరాత్ లో సబర్మతి కట్టుకున్నారు.. బీజేపీ వాళ్లు డిల్లీలో యమున నది శుద్ధి చేస్తామంటారు.. కానీ తెలంగాణలో మూసి పునరుజ్జీవం చేస్తామంటే.. బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటున్నారు..
గచ్చిబౌలి పోలీసుల నోటీసులకి ఐఏఎస్ స్మితా సబర్వాల్ రియాక్షన్..
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ రూపొందించిన ఫోటోను తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోతో ఆమె చిక్కుల్లో పడింది. అయితే, సదరు సీనియర్ ఐఏఎస్ అధికారిణికి బీఎన్ఎస్ 179 సెక్షన్ కింద గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే, తాజాగా గచ్చిబౌలి పోలీసుల నోటీసులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ స్పందించింది. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరించినట్లు తెలిపింది. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణ ఇస్తాను.. ఇక, నేను ఎలాంటి పోస్టు చేయలేదు.. హాయ్ హైదరాబాద్ ట్వీట్ ను రీపోస్ట్ మాత్రమే చేశాను.. నేను చేసినట్లే, సోషల్ మీడియాలో దాదాపుగా 2 వేల మంది కూడా రీపోస్టు చేశారు.. మరి వాళ్లందరిపైనా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారా అని క్వశ్చన్ చేసింది. చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా? అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ నిలదీశారు.
23 ఏళ్ల యువతితో 42 ఏళ్ల వ్యక్తి పెళ్లి.. పోలీసుల ఎంట్రీతో..
ఇద్దరి ఇష్టంతో జరిగితేనే అది పెళ్లి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా, తమ కూతురుకు పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలని కొందరు తల్లిదండ్రులు వయసు ఎక్కువగా ఉన్నవారికిచ్చి పెళ్లిల్లు చేయడం ఆ తర్వాత సమస్యలు ఎదుర్కోవడం చూస్తు్న్నాం. ఈడుజోడు కలవాలి, అభిప్రాయాలు ఒక్కటవ్వాలి అనే విషయాలను పట్టించుకోకపోవడం వల్ల పెళ్లిల్లు పెటాకులు అవుతున్నాయి. ఈ క్రమంలో కాకినాడలో 23 ఏళ్ల యువతితో 42 ఏళ్ల వ్యక్తి పెళ్లికి సిద్ధమయ్యాడు. పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
ధరణితో దందాలు చేశారు.. అలాంటి వాటికి భూ భారతిలో చోటు లేదు..
ఆదిలాబాద్ జిల్లాలో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధరణితో దందాలు చేశారు.. అలాంటి వాటికి ఇప్పుడు భూభారతిలో చోటు లేదన్నారు. గత పదేళ్లుగా ఆక్రమించిన భూ భాగోతం మొత్తం బయటకొస్తుందనే భయం వారికి పట్టుకుంది.. ఇంట్లో కూర్చోని ధరణి తయారు చేశారు.. విచ్చల విడిగా దొంగ వార్తలు ప్రచురిస్తున్నారు.. భూ భారతిలో వాళ్ల ఆగడాలు బయటకు వస్తాయనే అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు.. తప్పుడు వార్తలకు ప్రయార్టీ ఇస్తున్నారు.. ప్రజలు ఆలోచించాలి అని సూచించారు. వాళ్ల లాగా దొంగ మాటలు చెప్పి అధికారంలోకి రాలేదు.. మాది ప్రజల ప్రభుత్వం.. ధరణికి భూ భాతరతికి చాలా తేడా ఉంద అని మంత్రి సీతక్క వెల్లడించింది.
అజిత్కుమార్కు మరోసారి తప్పిన కారు ప్రమాదం..
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాల విషయం పక్కన పెడితే, ఆయన తరచూ రేసింగ్లో పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఆయన కారుకు మరోసారి ప్రమాదం జరిగింది. ఇటీవలే బెల్జియంలో జరిగిన సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోరాఛాంప్స్ రేస్లో అజిత్ పాల్గొన్నారు. అయితే ఈ రేసులో అజిత్ కారు నియంత్రణ కోల్పోయి ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఆయన సురక్షితంగా బయటపడడం అందరినీ ఊపిరిపీల్చుకునేలా చేసింది. గతంలో కూడా అజిత్ కార్ రేసింగ్ ట్రాక్ పై ప్రమాదానికి గురి కాగా ఇది మూడోసారి. అంతకముందు దుబాయ్లో జరిగిన గ్రాండ్ ప్రీ రేస్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా అజిత్ కారు గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కూడా అదృష్టవశాత్తు అజిత్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ తర్వాత స్పెయిన్లో జరిగిన మరో రేస్లో పక్కనే వస్తున్న మరో కారును తప్పించబోయి పల్టీలు కొట్టింది. ఇందులో కూడా అజిత్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇతర కారు వల్ల ప్రమాదం జరిగిందట. ఇక ఇప్పుడు మూడో సారి జరిగిన ఈ ప్రయాదంకి వీడియోను ఆయన టీమ్ స్వయంగా ఇన్ స్టాలో షేర్ చేసింది.
సన్నబియ్యంతో భోజనం పెట్టిన దంపతులకు.. నూతన వస్త్రాలు పెట్టిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న సన్నబియ్యం పంపిణీ పేదల కడుపు నింపుతోంది. ఇన్నాళ్లు దొడ్డు బియ్యం అన్నం తినలేక ఇబ్బంది పడిన వారు ఇప్పుడు రేవంత్ సర్కార్ సన్న బియ్యం అందిస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు స్వయంగ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి భోజనం చేస్తున్నారు. ఈ క్రమంలో రఘునాథాపలెం మండలం బూడిదేం పాడులో గుడిబండ్ల రాజారావు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును భోజనానికి ఆహ్వానించారు. గుడిబండ్ల రాజారావు దంపతులు సన్నబియ్యంతో భోజనం వడ్డించారు. సన్నబియ్యంతో భోజనం పెట్టిన దంపతులకు.. నూతన వస్త్రాలు పెట్టారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్, ఢిల్లీలో భూప్రకంపనలు
ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్, భారత్లో భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం మధ్యాహ్నం 12:17 గంటలకు భూకంపం సంభవించినట్లుగా తెలిపింది. జమ్మూకాశ్మీర్, ఢిల్లీ ఎన్సీఆర్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయని నివేదికలు అందుతున్నాయి. 130 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా పేర్కొంది. అయితే ఆస్తి, ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం అందలేదు. భారత్, పాకిస్థాన్లో చాలా చోట్ల ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల తరుచుగా ఆప్ఘనిస్థాన్లో భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల మయన్మా్ర్, థాయ్లాండ్లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ప్రస్తుతం ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
విశాఖ మేయర్ ఎన్నికలో కొత్త ట్విస్ట్..! వారిపై వైసీపీ ఫిర్యాదు
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పీఠాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కైవసం చేసుకున్నాయి.. ఇక, త్వరలోనే డిప్యూటీ మేయర్పై పెట్టిన అవిశ్వాసంపై ఓటింగ్ జరగనుంది.. అయితే, మేయర్ ఎన్నికలో చోటు చేసుకున్న పరిణామాలపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తమ పార్టీ బీ ఫాంపై గెలిచి కూటమికి అనుకూలంగా ఓటేసిన కార్పొరేటర్లపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.. వైసీపీ సభ్యులకు విప్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను ఎన్నికల అధికారికి అందజేశారు ఆ పార్టీ నేతలు తైనాల విజయ్ కుమార్, పల్లా దుర్గా రావు.. అవిశ్వాసానికి ఎవరు అనుకూలంగా ఓటు వేశారు…? వ్యతిరేకంగా ఓటీ వేశారో…? తమకు తెలియజేయాలని కోరారు వైసీపీ నేతలు.. అంతేకాదు.. పార్టీ విప్ను ధిక్కరిస్తూ.. వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించిన కార్పొరేటర్లపై అనర్హత వేటు వేసేందుకు న్యాయ పరమైన చర్యలు ప్రారంభించే యోచనలో వైసీపీ నేతలు ఉన్నారు..
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఎటాక్..
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్పై సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, సాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదో రకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కోటరీ ఉందా..? లేదా..? అసలు కోటరీ నడిపిందెవరో ఆయనకు తెలియదా..? అని నిలదీశారు.. మేం అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్షుడు నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారు అని స్పష్టం చేశారు.. కోటరీ ఉందో లేదో ఆయనకే తెలియాలన్నారు.
బీజేపీకి కట్టు బానిసలా కేటీఆర్ పని చేస్తున్నారు
కేటీఆర్కి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. దొంగల ముఠాలా రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకున్న మీరు అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నారని, పదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసిన మీరు, మీ అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా నరేంద్ర మోడీకి దాసోహమయ్యారని ఆయన మండిపడ్డారు. మీ బలహీనతలను ఆసరాగా తీసుకున్న బీజేపీ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలను, నిధులను ఇవ్వకుండా అన్యాయం చేసిందని మహేష్ గౌడ్ ఆరోపించారు. సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేసిన మీరు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని, పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశ పెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చింది మీరు కాదా కేటీఆర్ అని ఆయన ఆయన ధ్వజమెత్తారు. పదేళ్లలో మోడీ తీసుకున్న అనాలోచన నిర్ణయాలన్నింటికీ మద్దతిచ్చిన మీరు ఇప్పుడు కాంగ్రెస్ను ప్రశ్నించడం హాస్యాస్పదమని, కవితని లిక్కర్ స్కాం నుంచి కాపాడడానికి బీజేపీ కి ఊడిగం చేసిది నిజం కాదా? అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు.