*నీటి పారుదల శాఖలో పనులు అత్యంత పారదర్శకంగా ఉండాలి..
హైదరాబాద్ లోని జలసౌదలో తెలంగాణ రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టుల పురోగతిపై నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై ఆరా తీశారు. ఎస్ఎల్బీసీ పనుల గురించి అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుల వారీగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులకు అవుతున్న విద్యుత్ వినియోగం.. కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులపై మంత్రి లోతుగా సమీక్ష చేశారు. ఈ సమీక్షలో పాల్గొన్న ఈఎన్సీ మురళీధర్ తో పాటు ఉన్నతాధికారుల దగ్గర నుంచి పూర్తి వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నీటి పారుదల శాఖలో పనులు అత్యంత పారదర్శకంగా ఉండాలి అని సూచించారు. ప్రజల డబ్బులతో మనం ప్రాజెక్టులను కడుతున్నాం.. మనం పూర్తిగా బాధ్యతాయుతంగా, జవాబు దారి తనంతో పని చేయాలి అని తెలిపారు. తెలంగాణలో నీటి పారుదల రంగానికి చాలా ప్రాధాన్యత ఉంది.. అది గుర్తు పెట్టుకొని మనం పని చేయాలి అని ఆయన పేర్కొన్నారు. నీటి పారుదల పనులలో మూడో పార్టీ చెక్ ఉండాలి.. ప్రజల్లో నీటి పారుదల రంగంపై ఉన్న అపోహలు తొలగిపోయేలా అందరు పని చేయాలి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు ప్లాన్ చెయ్యండి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు తెలిపారు. ఇది చాల తీవ్రమైన అంశం.. ఈ మేడిగడ్డ నిర్మాణం చేసిన ఏజెన్సీని, అధికారులను వెంట ఉండేలా చుడండి.. అక్కడ ఖర్చు చేసింది ఎంత.. ఎంత ఆయకట్టుకు నీరిచ్చేందుకు నిర్మాణం జరిగింది.. ఒక్కో ఎకరా సాగుకు అవుతున్న ఖర్చు ఎంత అని అధికారులను ప్రశ్నించిన మంత్రి ఉత్తమ్.. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై విచారణకు ఆదేశిస్తాం.. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేసిన మంత్రి.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పై పూర్తి వివరాలు సిద్ధం చెయ్యండి.. ప్రత్యేకంగా సమీక్షా చేద్దాం అని ఆయన తెలిపారు. సీడ్యబ్లూసీ అనుమతి లేకుండా ప్రాజెక్టులు ఏ విధంగా నిర్మిస్తారని మంత్రి ప్రశ్నించారు. నిధులు ఎలా సమీకరించారు.. మీరు కడుతున్న ప్రాజెక్ట లను థర్డ్ పార్టీ చెకింగ్ లేదా అని ఆయన అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సీడ్యబ్లూసీ అనుమతి ఉందని అధికారులు తెలిపారు. పాత ఆయకట్టును కూడా ఎందుకు కొత్త ఆయకట్టులో కలుపుతున్నారని మంత్రి ప్రశ్నించారు. వర్షం వచ్చినప్పుడు నీటిని లిఫ్ట్ చెయ్యాల్సిన అవసరం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
*రూ. 500 గ్యాస్ సిలిండర్.. బారులు తీరిన జనం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అధికారం చేపట్టగానే మొదటి గ్యారంటీగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసింది. దీంతో రాష్ట్రంలో ఉన్న మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. దీని కోసం మహిళలు తమ ఆధార్ కార్డును చూపించవలసి ఉంటుంది. ఇక, ఈ గ్యారెంటీలలోనే మరొకటి మహిళలకు కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఈ పథకం కూడా అర్హులైన లబ్ధిదారులకు అధికారంలోకి వచ్చిన వెంటనే అందిస్తామని చెప్పింది. అయితే ఈ పథకం కోసం ఈ-కేవైసీ చేయించుకోకపోతే సబ్సిడీ రాదు అని వదంతంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం అవుతుంది. వెంటనే మహిళలందరూ కూడా ఆధార్ కార్డులతో గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరారు. కాగా, కేంద్ర ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఈ-కేవైసీ చేసుకొని మహిళలందరు వెంటనే చేయించుకోవాలని వెల్లడించింది. అయితే ఈ ప్రకటనకు తెలంగాణలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కు ఎలాంటి సంబంధం లేదు అని గ్యాస్ ఏజెన్సీలు ప్రకటించాయి. అయితే, చాలా మంది గ్యాస్ సబ్సిడీ రావాలంటే ఈ-కేవైసీ చేయించుకోవాలనే దుష్ప్రచారని వ్యా్ప్తి చేస్తున్నారు. దీంతో తమకి ఈ-కేవైసీ పూర్తి చేసుకోకపోతే సబ్సిడీ సిలిండర్ రాదు అనుకుని మహిళలు గ్యాస్ ఏజెన్సీల ముందు భారీగా క్యూ కట్టారు. గ్యాస్ ఏజెన్సీలు మాత్రం అలాంటివి ఏమీ లేదని కేవలం ఈ-కేవైసీ పూర్తి కానీ వారికి మాత్రమే చేస్తున్నామని తెలిపాయి. తెలంగాణలో గ్యాస్ లబ్ధిదారులందరూ ఈ విషయంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
*వైఎస్సార్ లా నేస్తం నిధుల విడుదల.. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్
వైఎస్సార్ లా నేస్తం నిధులను విడుదల చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులను జమ చేశారు సీఎం.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లా పూర్తి చేసుకొని తమ వృత్తిలో తాము నిలబడేందుకు, ఆ నిలబడే సమయంలో వారికి ప్రోత్సాహకంగా ఉండేందుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత మూడేళ్లపాటు సంవత్సరానికి రూ.60 వేలు అంటే నెలకు రూ.5 వేల చొప్పున మూడేళ్లకు రూ.లక్షా 80 వేలు ఇస్తున్నాం.. వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా వారికి తోడుగా ఉంటున్నాం అన్నారు. ఇక, మనం చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా దాదాపు ఈ ఏడాదికి సంబంధించి రెండో విడతలో 2,807 మంది అడ్వొకేట్ చెల్లెమ్మలు, తమ్ముళ్లకు ఈరోజు మంచి జరిగిస్తూ దాదాపు రూ.8 కోట్లు బటన్ నొక్కి ఒక్కొక్కరికి 30 వేల చొప్పన బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం అన్నారు సీఎం జగన్.. నాలుగేళ్లలో మొత్తంగా వైఎస్సార్ లా నేస్తం ద్వారా 6,069 మంది జూనియర్ అడ్వొకేట్లకు మంచి జరిగింది.. దానికోసం మనందరి ప్రభుత్వం రూ.49.51 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇటువంటి అడ్వొకేట్లకు వాళ్ల ఇనీషియల్ స్టేజ్లో నిలదొక్కుకొనేందుకు ప్రభుత్వం మంచి చేస్తూ అడుగులు ముందుకేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా వాళ్ల ప్రొఫెషన్లో వాళ్లు నిలదొక్కుకోవడం, తర్వాత ఇదే మంచిని జ్ఞాపకం ఉంచుకొని పేదవాళ్ల పట్ల అదే ఔదార్యం చూపించే మంచి సంస్కృతికి మనం చేసే ఈ కార్యక్రమం మంచి ముందడుగు అవుతుందన్నారు.
*తాడేపల్లికి మంగళగిరి పంచాయతీ.. తాజా పరిణామాలపై సీఎంతో నేతల భేటీ
మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఏపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఉదయం నుంచి వేగంగా మంగళగిరి నియోజకవర్గ రాజకీయాలు మారుతున్నాయి. మంగళగిరి పంచాయతీ తాడేపల్లికి చేరింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో వైసీపీ హైకమాండ్ అలెర్ట్ అయింది. సీఎంఓ పిలుపుతో పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, గంజి చిరంజీవి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో బీసీ నేత గంజి చిరంజీవికి మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలు ఇస్తారని విస్తృతంగా జరుగుతున్న ప్రచారం జరుగుతోంది. అందుకే గంజి చిరంజీవికి క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు వచ్చినట్లు పార్టీ వర్గాల్ల ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలపై సీఎం జగన్తో నేతలు భేటీ భేటీ అయ్యారు. ఈ భేటీలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు.
*ఆర్కే ఎందుకు రాజీనామా చేశారో నాకు తెలియదు..
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేశారన్నా వార్త తనకు ఇప్పుడే తెలిసిందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. ఓఎస్డీ ద్వారా సమాచారం అందిందన్నారు. ఆర్కే ఎందుకు రాజీనామా చేశారన్న స్పష్టత గురుంచి తనకు తెలియదన్నారు. ఆయనతో పర్సనల్గా మాట్లాడి తెలుసుంటామని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా ఇచ్చినంత మాత్రాన అది రాజీనామా కింద ఆమోదించలేమని, ఆ రాజీనామా రాజ్యాంగబద్ధంగా ఉందో లేదో చూసేంతవరకు దీనిపై స్పష్టత ఇవ్వలేమన్నారు. ఆర్కేకు సముచిత స్థానం ఇవ్వలేదు అందుకే రాజీనామా చేశారన్నది అవాస్తవమన్నారు. సముచిత స్థానం ఇవ్వకపోతే ఇన్నాళ్లు జగన్కు అత్యంత సన్నిహితంగా ఎలా వుంటారని ఆయన ప్రశ్నించారు.
*వైసీపీకి వరుస షాక్లు..! మంగళగిరిలో కొనసాగుతున్న రాజీనామాలు..
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా షాక్లు తగులుతున్నాయి.. మంగళగిరి వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ రోజు.. ఎమ్మెల్యే పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే, ఎమ్మెల్యే ఆర్కే రాజీనామాతో తాడేపల్లిలో రాజీనామాలు మొదలయ్యాయి.. వైసీపీ పార్టీ పదవులకు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్ర ముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి గుడ్బై చెప్పారు. అంతటితో రాజీనామాలు ఆగలేదు.. తాడేపల్లి రూరల్ మండల అధ్యక్షులు పార్టీని వీడారు.. జేసీఎస్ కన్వీనర్ మున్నంగి వివేకానంద రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేయగా.. జిల్లా ప్రధాన కార్యదర్శి, తాడేపల్లి పట్టణ నేత, జేసీఎస్ కన్వీనర్ ఈదులముడి డేవిడ్ రాజ్.. జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మేకా వెంకటరామిరెడ్డి.. మంగళగిరి రూరల్ మండలం జేసీఎస్ కన్వీనర్ అన్నపురెడ్డి బ్రహ్మర్గన రెడ్డి.. ఇలా నేతలంతా వరుసగా తమ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఇలా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. కాగా, పార్టీకి గత కొంత కాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఎమ్మెల్యేగా అధికారిక కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతూ వస్తున్న ఆయన.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు.. మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంపై కూడా ఆర్కే ఆవేదనతో ఉన్నట్టుగా ప్రచారం జరగుతోంది.. మంగళగిరి అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ.. బీసీలకు కేటాయిస్తుందనే ప్రచారం కూడా మరో కారణంగా చెబుతున్నారు.. ఈ క్రమంలోనే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.. ఇక, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను గెలిపించిన మంగళగిరి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఆర్కే.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. స్పీకర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఓఎస్డీకి నా రాజీనామా లెటర్ అందించి రాజీనామా ఆమోదించేలా చూడాలని కోరడం జరిగిందంటూ తెలిపిన ఎమ్మెల్యే ఆర్కే.. నేను 1995 నుండి రాజకీయాల్లో ఉన్నాను.. 2004 లో సత్తెనపల్లి సీటు ఆశించా.. 2009లో పెదకూరపాడులో సీటు ఇచ్చి వెనక్కు తీసుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఇక, వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ తోనే నేను ఉన్నానని తెలిపారు.. 2014, 2019లో ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ నాకు అవకాశం ఇచ్చారని తెలిపారు. అయితే, నా వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.
*లోక్సభ ఎంపీగా బహిష్కరణ.. సుప్రీంను ఆశ్రయించిన మహువా మోయిత్రా
‘క్యాష్ ఫర్ క్వైరీ’ కేసులో తనను పార్లమెంట్ సభ్యత్వం నుంచి బహిష్కరించడాన్ని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి బహుమతులు, అక్రమంగా లంచం తీసుకున్నట్లు ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను సభ ఆమోదించడంతో డిసెంబర్ 8న మొయిత్రాను లోక్ సభ నుంచి బహిష్కరించారు. ఈ ఆరోపణలను టీఎంసీ నేత తీవ్రంగా ఖండించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎథిక్స్ కమిటీ నివేదికపై ఓటింగ్ నిర్వహించగా, దానిని మూజువాణి ఓటుతో ఆమోదించారు. లోక్సభ నుంచి తనను బహిష్కరించిన తర్వాత.. ఎథిక్స్ కమిటీ తన నివేదికలోని ప్రతి నిబంధనను ఉల్లంఘించిందని మహువా మోయిత్రా అన్నారు. ఇది బీజేపీ అంతానికి నాంది అని విమర్శించారు. ఈ క్రమంలో.. లోక్సభ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం.. మహువా మోయిత్రా హైకోర్టును ఆశ్రయించవచ్చు. అయితే ఆమె ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటులో ఆమోదించిన చట్టాలను సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చు. మహువా నిర్దోషి అని తేలితే, ఆమె ఎంపీ హోదాను పునరుద్ధరించవచ్చు. దోషిగా తేలితే, ఎంపీని తిరిగి నియమించే అవకాశాలు ఉండవు. కాగా.. లంచం తీసుకుంటూ పార్లమెంట్లో ప్రశ్నలు అడిగిన ఆరోపణలపై మహువా మోయిత్రా దోషిగా తేలింది. బీజేపీ ఎంపీ వినోద్కుమార్ సోంకర్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీ నవంబర్ 9న జరిగిన సమావేశంలో డబ్బులు తీసుకుని, సభలో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలపై లోక్సభ నుంచి మొయిత్రాను బహిష్కరించాలని సిఫార్సు చేసిన నివేదికను ఆమోదించింది.
*ఆర్టికల్ 370పై సుప్రీం తీర్పు.. మోడీ స్పందన
‘ఆర్టికల్ 370’పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని కొనియాడుతూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్ రద్దుపై 2019, ఆగస్టు 5వ తేదీన భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని చెప్పారు. సుప్రీం తీర్పు జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రజల ఐక్యతను చాటి చెప్పిందన్నారు. ‘భారతీయులు గౌరవించే ఐక్యతా సారాంశాన్ని సుప్రీంకోర్టు బలపరిచింది. జమ్మూకశ్మీర్, లడఖ్లోని ప్రజల కలలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇస్తున్నాను. అభివృద్ధి ఫలాలు జమ్మూకాశ్మీర్ ప్రజలకు చేరడమే కాకుండా, ఆర్టికల్ 370 కారణంగా నష్టపోయిన అత్యంత బలహీన, అట్టడుగు వర్గాలకు వాటి ప్రయోజనాలను అందజేయాలని నిశ్చయించుకున్నాం. ఈరోజు తీర్పు కేవలం చట్టపరమైన తీర్పు మాత్రమే కాదు..ఇది ఆశాకిరణం. ఉజ్వల భవిష్యత్తుకోసం బలమైన, మరింత ఐక్యతాయుత భారతదేశాన్ని నిర్మించాలనే తమ సంకల్పానికి సుప్రీంకోర్టు తీర్పు నిదర్శనమని’ ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ‘ఆర్టికల్ 370’ రద్దు రాజ్యాంగబద్ధమేనని పేర్కొంటూ భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోపు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది.
*ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు నిర్ణయంపై బీజేపీ నేతలు స్పందన ఇదే..!
గతంలో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం సబబేనని తెలిపింది. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ నాయకులు స్పందించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలియజేశారు. “ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో.. జమ్మూ కాశ్మీర్ను దేశంలోని ప్రధాన భావజాలంలో చేర్చే చారిత్రాత్మక పనిని ప్రభుత్వం చేసిందని అన్నారు. ఇందుకోసం నేను, కోట్లాది మంది కార్మికులు ప్రధానమంత్రికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.” అని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా సమర్థించబడుతుందని రుజువు చేసిందని అన్నారు. అమిత్ షా ‘X’లో పోస్ట్లో పేర్కొన్నారు. ఈ పోస్ట్తో పాటు ‘న్యూ జమ్మూ కాశ్మీర్’ అనే హ్యాష్ట్యాగ్ కూడా రాశారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నిర్ణయం తీసుకున్నారని.. అప్పటి నుంచి జమ్మూకశ్మీర్లో శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నాయని అమిత్ షా తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలపడం ప్రతి భారతీయుడిని సంతోషపెట్టే ‘చారిత్రక’ నిర్ణయమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ ‘అభివృద్ధి చిహ్నం’ అని అన్నారు. రాజ్నాథ్ సింగ్ ఇది సంతోషాన్ని కలిగించే విషయమని ట్విటర్ లో పోస్ట్ చేశారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ప్రధాని మోదీ కొత్త అధ్యాయాన్ని లిఖించడమే కాకుండా.. భారతదేశ ఐక్యత, సమగ్రతకు కొత్త బలాన్నిచ్చారని అన్నారు. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో కొత్త శకంలోకి ప్రవేశించిందని.. ప్రధాని మోదీ నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ మొత్తం అభివృద్ధి, సుపరిపాలనలో అగ్రగామిగా నిలుస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
*కన్నప్ప షూటింగ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ కు గాయాలు.. షూట్ నిలిపివేత!
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్లో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కన్నప్ప టీం నుంచి ఓ వార్త బయటకు వచ్చింది. కన్నప్ప షూటింగ్లో స్టార్ కొరియోగ్రాఫ్గర్ బృందా మాస్టర్ గాయపడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సాంగ్ షూటింగ్ అప్పటికప్పుడు నిలిపివేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా షూట్ లో అక్టోబర్ నెలలో మంచు విష్ణు గాయపడగా అప్పట్లో కూడా సినిమా షూటింగ్ను తాత్కాలికంగా ఆపేశారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా రాబోతోన్న ఈ కన్నప్ప స్థాయి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే పాన్ ఇండియన్ హీరో ప్రభాస్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, శాండల్ వుడ్ నుంచి శివ రాజ్ కుమార్, తమిళ శరత్ కుమార్, మోహన్ బాబు వంటి వారు కన్నప్పలో భాగమైన సంగతి తెలిసిందే. ఇలా ఇంకెన్నో సర్ ప్రైజ్ క్యాస్టింగ్, కన్నప్పలో ఉందని అంటున్నారు. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుతున్న కన్నప్ప టీంకి ఈ అనుకోని ఘటన ఎదురైందని, సాంగ్ షూట్ చేస్తున్న సమయంలో బృందా మాస్టర్ కి గాయం అయిందని ఆదివారం నాడు ఈ ఘటన జరుగగా వెంటనే షూట్ నిలిపివేసినట్టు తెలుస్తోంది. హిందీ బుల్లితెరపై మహాభారతం సీరియల్లోని కొన్ని ఎపిసోడ్స్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి వారు రచనా విభాగంలో పని చేశారు.