High Court: తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావులకు బిగ్ రిలీఫ్ లభించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపేసింది. ఈ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇక ఈ అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. సత్యమేవ జయతే అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. “ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైంది. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పునిచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయి. ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యింది. ఇప్పటికైనా కక్షసాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు ఔనన్నా కాదన్నా.. ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం..” అని ట్వీట్లో పేర్కొన్నారు.
READ MORE: Polavaram-Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. జనాలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ!
మరోవైపు ఈ అంశంపై ఎంపీ చామల కిరణ్ స్పందించారు. హైకోర్టు తీర్పు పై పూర్తి వివరాలు రావాల్సి ఉందని తెలిపారు. “ఘోష్ కమిషన్ను కోర్టు తప్పు పట్టలేదు. కొన్ని అభ్యంతరాలు చెప్పింది. విజిలెన్స్ నివేదిక ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ Ndsa కూడా కాళేశ్వరంలో పొరపాట్లు, అవకతవకలు జరిగాయని చెప్పింది. ప్రభుత్వం సీబీఐ విచారణ అడిగింది కూడా… ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా అడగలేదు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీద ఇప్పుడు బాధ్యత పెరిగింది. వాళ్లకు క్లీన్ చిట్ ఇవ్వడం మీక్కూడా సంతోషంగా ఉందా..? సాయంత్రం లోపు ప్రభుత్వం ఆలోచనను తెలియజేస్తుంది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటుంది. ఈ తీర్పుతో బీఆర్ఎస్ సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఘోష్ నివేదిక మీద చర్యలు వద్దని చెప్పింది కానీ.. చర్యలే వద్దని చెప్పలేదు.” అని ఎంపీ పేర్కొన్నారు.
