సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఐఏఎస్ అధికారి శరత్ అత్యుత్సాహం ప్రదర్శించారు. సభలో పాల్గొనడానికి వచ్చిన సీఎం కాళ్లు మొక్కారు. ఐఎఎస్ శరత్ వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ కాళ్లు ఐఏఎస్ శరత్ మొక్కడంపై ఆల్ ఇండియా సర్వీసెస్ అధికార వర్గాల్లో చర్చ జరిగింది. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కే.రామకృష్ణారావు సీరియస్ అయ్యారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read: Top Headlines @9PM : టాప్ న్యూస్!
సివిల్ సర్వీసెస్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలంగాణ సీఎస్ రామకృష్ణ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘కొందరు ఐఏఎస్, ఐపీఎస్లు స్థాయికి తగినట్లుగా ఉండకపోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సభలు, సమావేశాల్లో ఉన్నతాధికారులు హుందాగా వ్యవహరించాలి. సభలు, సమావేశాల్లో హుందాగా ఉండకపోతే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. ప్రజలను కలిసినప్పుడు ఐఏఎస్, ఐపీఎస్లు ప్రొఫెషనలిజం ప్రదర్శించాలి. ప్రజాప్రతినిధుల పట్ల సివిల్ సర్వీసెస్ రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించొద్దు. ఇకపై ఏ అధికారి నిబంధనలు అతిక్రమించినా చర్యలు తప్పవు’ అని సీఎస్ హెచ్చరించారు. గతంలో ఐఏఎస్లు ప్రజాప్రతినిధుల కాళ్లు మొక్కడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఇకపై ఐఏఎస్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు అలా వ్యవహరించవొద్దని సీఎస్తో సీఎం ఆదేశాలు ఇప్పించారు.