ఫ్రెండ్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నాడని అతనికి వీడ్కోలు చెప్పి తిరిగి వస్తుండగా మృత్యువు కబలించింది..ఈ విషాదకర ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిలోని కోమళ్ల టోల్గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే.. అమెరికాకు వెళ్తున్న తమ మిత్రుడికి సెండాఫ్ ఇచ్చేందుకు వరంగల్కు చెందిన రాకేశ్ చంద్ర గౌడ్, సందీప్ ఇద్దరూ కలిసి శుక్రవారం రాత్రి బొలెరోలో హైదరాబాద్కు వెళ్లారు. పెంబర్తి రిసార్ట్లో రాత్రంతా స్నేహితుడితోనే ఉండి.. శనివారం ఉదయం 5 గంటలకు తిరిగి హన్మకొండకు బొలెరోలో బయలు దేరారు..
అయితే తెల్లవారుజామున ట్రాఫిక్ లేకపోవడంతో కాస్త వేగంగానే వచ్చారు.. అదే వారిని డైరెక్టర్ గా మృత్యువు ఒడిలోకి తీసుకెళ్ళింది..కోమళ్ల టోల్గేట్ సమీపంలోని ఓ మలుపు వద్ద రోడ్డు మీదే లారీ పార్క్ చేసి ఉంది. దాన్ని గమనించకపోవటంతో.. వేగంగా వచ్చిన బొలేరో లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో.. బొలేరో వాహనం.. లారీ కిందికి చొచ్చుకుపోయి.. ముందుబాగమంతా నుజ్జునుజ్జయింది. కాగా.. ముందు సీట్లలో ఉన్న రాకేశ్ చంద్ర గౌడ్, సందీప్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.. ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు..
మృతదేహాలను బయటకు తీసి జనగామ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. హన్మకొండ గాంధీనగర్కు చెందిన రాకేశ్ చంద్ర గౌడ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. రాకేశ్కు భార్య, 9 నెలల బాబు ఉన్నాడు. అలాగే.. నయీంనగర్కు చెందిన సందీప్ బీటెక్ చదివి బిల్డర్గా కొనసాగుతున్నాడు. సందీప్కు భార్య, 18 నెలల చిన్నారి ఉంది. ఈ ఘటన తెలిసి.. కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.. చిన్న పిల్లలు ఉండటంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు..ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా స్థానికులు చెప్తున్నారు. ఈ మార్గంలో లారీలు నిబంధనలకు విరుద్దంగా.. ఇష్టారీతిన రోడ్డు మీదే ఆపేస్తున్నారని అందుకే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు..