అమరావతిలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ రాజకీయాలపై ప్రభావం చూపిన ప్రాంతీయ పార్టీ టీడీపీ అని, ఇది చరిత్రలో నిలిచిపోయే నిజమని అన్నారు. పార్టీ ఎదుగుదలలో కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని, జెండా మోసే కార్యకర్తలే నిజమైన నాయకులని లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తించి గౌరవించడం తన బాధ్యతగా భావిస్తున్నానని లోకేష్ తెలిపారు.
‘గ్రామ స్థాయి నుంచి పొలిట్బ్యూరో స్థాయి వరకు కష్టపడిన వారిని ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నా. కార్యకర్తల సంక్షేమం కోసం టీడీపీ ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు పెట్టింది. ఎన్టీఆర్ పాలనలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలనా సంస్కరణలు రాష్ట్రానికి దిశానిర్దేశం చేశాయి. సీఎం చంద్రబాబు నాయుడు వయసు 75 అయినప్పటికీ.. ఆయన వేగం 25 ఏళ్ల యువకుడిలా ఉంది. చంద్రబాబు సాధించిన విజయాలు, సృష్టించిన రికార్డులను ఎవరూ బద్దలు కొట్టలేరు’ అని మంత్రి నారా లోకేష్ అన్నారు.
Also Read: TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి.. డీఎంకే, ఏఐడీఎంకే కంచుకోటల నుంచే విజయ్ పోటీ!
‘దేశ రాజకీయాల్లో కూడా టీడీపీ తన ముద్ర వేసింది. అంబేద్కర్కు భారతరత్న అందించడంలో ఎన్టీఆర్ పాత్ర ఉంది, అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా అవతరించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. దళితుణ్ని లోక్సభ స్పీకర్గా చేయడం కూడా టీడీపీ గొప్పతనం. కార్యకర్తలు ప్రజలతో ఎల్లప్పుడూ మమేకమై ఉండాలి, అహంకారం వద్దు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడమే అసలు రాజకీయం. గతంలో అహంకారంతో వ్యవహరించిన వారు ఎలా క్షీణించారో చూశాం’ అని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. పార్టీ కార్యకర్తలతో నేరుగా కనెక్ట్ కావడానికి ‘మై టీడీపీ’ యాప్ను వినియోగించుకోవాలని సూచించారు. ఇందులో ‘సీబీఎన్ కనెక్ట్’ అనే లింక్ ద్వారా అభిప్రాయాలు, సూచనలు తెలియజేయవచ్చని లోకేష్ చెప్పారు.