మణిపూర్ లో మరోసారి సాయుధ మూకలు రెచ్చిపోయాయి. బిష్ణుపుర్ జిల్లాలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న నలుగురు వ్యక్తులను కాల్పులు జరపడంతో అక్కడిక్కడే మరణించారు. ఇక, నింగ్తౌఖోంగ్ ఖా ఖునౌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వారిలో తండ్రీ కొడుకులు కూడా ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. స్థానికంగా ఉన్న ఓ కొండ ప్రాంతం నుంచి వచ్చిన కొంతమంది దుండగులు వ్యవసాయ కూలీలను బంధించి కాల్చినట్లు తెలుస్తుంది. అనంతరం అక్కడి నుంచి తిరిగి అడవుల్లోకి ఈ దుండగులు పారిపోయారని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే, మరో ఘటనలో సాయుధ మూకలు జరిపిన కాల్పుల్లో ఓ గ్రామ వాలంటీర్ కూడా చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: AUS vs WI: 9 వికెట్లతో హాజిల్వుడ్ విజృంభణ.. ఆస్ట్రేలియా చేతిలో చిత్తైన వెస్టిండీస్!
కంగ్పోక్పీ జిల్లాలో రెండు వైరి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో కాల్పులకు దారి తీసినట్లు పోలీసులలు తెలిపారు. కొండ ప్రాంతాలకు చెందిన మిలిటెంట్లు కంగ్చుప్ గ్రామంపై దాడి చేశారు. దీంతో గ్రామస్థులు సైతం ప్రతిదాడులు చేశారని పేర్కొన్నారు. ఇక, వాలంటీర్ మరణం తర్వాత ఇంఫాల్లో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఇక, కేంద్ర, రాష్ట్ర బలగాల సమన్వయం కోసం ఏర్పాటు చేసిన ఈశాన్య రాష్ట్ర భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం నివాసం, రాజ్ భవన్ వరకు మహిళలు ర్యాలీ తీశారు. అయితే, రాజ్ భవన్ కు 300 మీటర్ల దూరంలో మహిళలను పోలీసులు అడ్డుకున్నారు.