Robbery in Train: తిరుపతి-గుంటూరు ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తిరుపతి నుంచి గుంటూరు వెళుతుండగా.. అర్ధరాత్రి ఒక్కసారిగా బోగీల్లోకి చొరబడి రెచ్చిపోయారు. ప్రయాణికులను బెదిరించి అందినకాడికి దోచుకున్నారు. శుక్రవారం రాత్రి రైలు తిరుపతిలో రాత్రి 7.30 గంటలకు బయల్దేరాల్సి ఉంది.. కానీ ఓ గంట ఆలస్యంగా కదిలింది. అలా కడప జిల్లా కమలాపురం రైలు నిలయం దాటిన తర్వాత ఓ సిమెంటు పరిశ్రమ సమీపంలో అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో ఆగింది. రైలు ఆగిన తర్వాత 20 నుంచి 25 మంది వరకు దుండగులు వచ్చారు. ఆ దొంగలు ఒక్కసారిగా ఎస్1 నుంచి ఎస్6 వరకు ఉన్న బోగీల్లో కిటీకీల పక్కన ఉన్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోయారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల బంగారు ఆభరణాలు లాక్కుని దుండగులు పారిపోయారు. రైల్లో కొందరు ప్రయాణికులు ప్రతిఘటించే యత్నం చేయగా వారిపై ఆ దుండగులు దాడులు చేశారు. ఎస్3 బోగీలో నలుగురు మహిళల బంగారు ఆభరణాలు లాక్కెళ్లేందుకు దుండగులు ప్రయత్నించగా.. ముగ్గురు ప్రతిఘటించినట్లు చెబుతున్నారు. దీంతో ఒకరి మెడలో మాత్రం బంగారు గొలుసు లాక్కెళ్లినట్లు చెప్పారు.
Read Also: Pacific Ocean: పసిఫిక్ మహాసముద్రంలో 7.1 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
రైలు ఎర్రగుంట్ల రైలు నిలయానికి చేరుకున్న అనంతరం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరులో పోలీసులు బోగీల్లో బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రైలుకు గస్తీ నిర్వహించాల్సిన పోలీసులు తిరుపతి నుంచి ఎర్రగుంట్ల వరకు ఎవరూ ఉండరని.. ఎర్రగుంట్ల నుంచి గుంటూరు వరకు పోలీసు భద్రత ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలిసే ఎర్రగుంట్ల ముందు రైలును నిలిపి దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఏకంగా 20 నుంచి 25 మంది దొంగలు దోపిడీకి రావడం కలకలం సృష్టించింది. పక్కా ప్లాన్ ప్రకారం చోరీగా పాల్పడ్డారా అనే అనునాలు రేకెత్తుతున్నాయి. గతంలో కూడా రైళ్లలో దోపిడీలు జరిగాయి. రైల్వే పోలీసులతో భద్రతను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.