గొప్ప చరిత్ర ఈ వరంగల్ కు 2014లో గ్రహణం పట్టిందని వ్యాఖ్యానించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నేడు వరంగల్లో హాత్ సే హాత్ జోడో పాదయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచానికి మేధావులను అందించిన చరిత్ర కాకతీయ యూనివర్సిటీదని, అలాంటి కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు లేవు, ప్రొఫెసర్లు లేని పరిస్థితి అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర మరువలేనిదని, కొండా దంపతుల మీద కోపంతో వరంగల్ ను ఈ దండుపాళ్యం ముఠా చెత్త కుప్పగా మార్చారన్నారు. పౌరుషానికి మారుపేరైన ఈ గడ్డపై బిల్లా రంగా లాంటి ఎమ్మెల్యేలు అవసరమా? వరంగల్ లో ఏ ఎమ్మెల్యే అయినా ప్రజలకు అందుబాటులో ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. ‘వరంగల్ లో బీఆరెస్ నేతలు భూములు ఆక్రమించుకుని దోచుకుంటున్నారు. అజాం జాహీ మిల్లు కార్మికులకు ఇవ్వాల్సిన భూమి ఈ ప్రభుత్వం పంపిణీ చేయలేదు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప వరంగల్ లో ఈ తొమ్మిదేళ్లలో ఏ అభివృద్ధి జరగలేదు.
Also Read : Interesting Facts: మిమ్మల్ని వావ్ అనిపించే 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
వరంగల్ అంటే ప్రేమ అంటున్న కేసీఆర్ కు ఇక్కడి భూములు ఇక్కడి ఆస్తులపైనే ప్రేమ. తొమ్మిదేళ్లలో వెయ్యి ఎకరాల్లో కేసీఆర్ ఫామ్ హౌస్, కొడుకుకు 500 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది తప్ప పేదలకు ఒరిగిందేం లేదు. రాష్ట్రంలో ఈ రావణకాష్టానికి పరిష్కారం లేదా? తెలంగాణ తెచ్చిన అన్నోడికి రెండు సార్లు ఇచ్చారు.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి. వరంగల్ లో కొండా దంపతులను ఆశీర్వదించండి.. వారు మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటారు. వైఎస్ హయాంలో వారికి ఎలాంటి గౌరవం దక్కిందో.. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే గౌరవం ఉంటుంది.
Also Read : YS Sharmila : హిజ్రాలకు వైఎస్ షర్మిల బహిరంగ క్షమాపణ చెప్పాలే..
ఆనాడు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది కాంగ్రెస్.. ఈనాడు ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు ఇవ్వబోయేది కాంగ్రెస్. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. వరంగల్ ఈస్ట్ లో సురేఖమ్మ గెలుపు ఖాయం.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ ను గెలిపించుకుందాం… ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందాం’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.