China-US: ట్రంప్‌కు చైనా షాక్.. అమెరికన్ వస్తువులపై 125% సుంకం!

  • చైనా వస్తువులపై 145 శాతం సుంకం విధించిన యూఎస్
  • యూఎస్‌కు తగిన సమాధానం ఇచ్చిన చైనా
  • అమెరికా ఉత్పత్తులపై సుంకాన్ని 125 శాతానికి పెంచిన చైనా
China Us

China Us

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై 145 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చైనా కూడా యూఎస్‌కు తగిన సమాధానం ఇచ్చింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాన్ని 84 శాతం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు చైనా ప్రకటించింది. ఈ అదనపు టారిఫ్ ఏప్రిల్ 12 నుంచి వర్తిస్తుంది. ఏప్రిల్ 12 నుంచి చైనాలో అమెరికన్ ఉత్పత్తులపై సుంకం 84 శాతం నుంచి 125 శాతానికి పెరుగుతుందని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఈ విధంగా చైనా ప్రయోజనాలను అణిచివేస్తూ ఉంటే.. తాము కూడా చివరి శ్వాస వరకు పోరాడతామని చైనా పేర్కొంది.

READ MORE: Tamil Nadu: మహిళలపై తమిళనాడు మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖులు ఫైర్

చైనా ఉత్పత్తులపై సుంకాన్ని 145 శాతానికి పెంచుతూ ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన తర్వాత చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సుంకం పెంపు అంశంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తొలిసారి స్పందించారు. ఈ వాణిజ్య యుద్ధంలో ఎవరూ గెలవరని ఆయన ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఎవరు ఎన్ని చేసినా తమ దేశం భయపడబోదని స్పష్టం చేశారు. బీజింగ్‌లో స్పానిష్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి వ్యతిరేకంగా వెళితే అమెరికా ఒంటరిగా మిగులుతుందన్నారు.

READ MORE: Jogi Ramesh: ముగిసిన జోగి రమేష్‌ సీఐడీ విచారణ.. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు..

“ట్రంప్‌ విధించిన 145 శాతం సుంకాలు బెదిరింపులతో కూడినవి. ఏకపక్షంగా అమెరికా నిర్ణయాలు తీసుకుంది. ఇది సరైన విధానం కాదు . ట్రంప్‌ పన్నులను ప్రతిఘటించడానికి యూరోపియన్‌ యూనియన్‌ మాతో కలిసి రావాలని కోరుతున్నాను. యూరప్‌ తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంది. అందరూ కలిసి ఐకమత్యంగా అమెరికాపై పోరాటం చేయాల్సి ఉంది” అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. అమెరికాతో వాణిజ్య యుద్ధం పెరుగుతున్న నేపథ్యంలో చైనా, యూరోపియన్ యూనియన్ మధ్య సహకారాన్ని పెంచడంపై జిన్‌పింగ్ నొక్కి చెప్పారు. చైనా, యూరప్ తమ అంతర్జాతీయ బాధ్యతలను నిర్వర్తించాలని, ఈ ఏకపక్ష బెదిరింపునకు సంయుక్తంగా స్పందించాలని ఆయన అన్నారు.