Rahul Gandhi: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నేడు (శుక్రవారం) బెంగళూరుకు వెళ్లనున్నారు. ఇక, బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెంగళూరు కోర్టుకు హాజరుకానున్నారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు.. గత బీజేపీ ప్రభుత్వం అవినీతిమయమైందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దీంతో బీజేపీ నేత ఎస్ కేశవ ప్రసాద్ పరువు నష్టం దావా వేశారు. దీనిపై ఇవాళ తమ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Read Also: UP: ఉత్తర్ ప్రదేశ్ బీజేపీలో కలకలం.. రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ రాజీనామా!
ఇక, 2023 రాష్ట్ర ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ అవినీతికి పాల్పడిందంటూ స్థానిక వార్తాపత్రికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటన ఇచ్చింది. అన్ని పబ్లిక్ వర్క్స్ అమలుకు 40 శాతం కమీషన్ వసూలు చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రకటనలో గత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని అవినీతి కార్డును కూడా హస్తం పార్టీ నేతలు రిలీజ్ చేశారు. దీంతో కర్ణాటక బీజేపీ శాఖ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. ఈ కేసులో భాగంగా రాహుల్ గాంధీ ఇవాళ బెంగళూరులోని స్థానిక కోర్టుకు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే ప్రకటన ప్రచురణలో రాహుల్ గాంధీ ప్రమేయం లేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. జూన్ 1వ తేదీన హాజరు కానందుకు రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కర్ణాటక బీజేపీ యూనిట్ న్యాయస్థానాన్ని కోరింది. అయితే, జూన్ 7న తప్పనిసరిగా హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.