ప్రతీ రోగికీ సేవలందించాలని, ప్రతీ డాక్టర్ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. యువ డాక్టర్లు సేవ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని తాను కోరుతున్నా అని.. ఆరోగ్యకరమైన, అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలన్నారు. దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని, పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలన్నారు. సమయం, పరిస్ధితులను బట్టి ప్రతీ మనిషి జీవనశైలి ఉండాలని రాష్ట్రపతి సూచించారు. మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఎంబీబీఎస్ విద్యార్థులు డిగ్రీ పట్టాలు అందుకున్నారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ… ‘పానకాల స్వామికి నా ప్రార్ధన. లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి. యువ వైద్యులుగా మీరందరూ అత్యుత్తమ సేవలందించాలి. ఇప్పుడు డాక్టర్లు అయిన వారిలో 2/3 వంతు మహిళా డాక్టర్లు ఉన్నారు. మన భారత మహిళలు, యువతులు అన్ని రంగాలలో ఉన్నతి సాధించాలి. ఎయిమ్స్ మొదటి బ్యాచ్ గా మీరందరూ గుర్తుంటారు. దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి. పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలి. ప్రతీరోజూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. యోగాసనాలు, ప్రాణాయామాలు చేయడం ఆరోగ్యంగా ఉండటానికి అవసరం. సమయం, పరిస్ధితులను బట్టి ప్రతీ మనిషి జీవనశైలి ఉండాలి’ అని అన్నారు.
‘మెడికల్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ తో అందరికీ ఉపయోగపడే సేవలు అందిస్తారని ఆశిస్తాను. ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజలకు ఆరోగ్య సేవలు తేలిగ్గా అందించడమే ధ్యేయం. ప్రపంచపటంలో భారతదేశం మెడికల్ సేవలలో అందుబాటులో ఉండే దేశంగా నిలవటానికి మన డాక్టర్ల సేవలు మరువలేనివి. ప్రతీ రోగికీ సేవలందించాలి, ప్రతీ డాక్టర్ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలి. యువ డాక్టర్లు సేవ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నా. ఆరోగ్యకరమైన, అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలి’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.