Prashant Kishor meets Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనమే జరిగింది.. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే.. ఇప్పుడు జెండా మార్చేశారు.. అదేనండి.. ఈ సారి తన వ్యూహాలను తెలుగుదేశం పార్టీకి ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పీకే సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారిపోయింది.. ఉన్నట్టుండి ఈరోజు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమైన పీకే.. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి నేరుగా టీడీపీ జాతీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కారు ఎక్కారు.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లారు..
Read Also: Air India: ఎయిర్ ఇండియా చేతికి మొట్టమొదటి ఎయిర్బస్ A350-900.. ఆకాశంలో ఇంద్రభవనం ఈ విమానం..
హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు నారా లోకేష్, ప్రశాంత్ కిషోర్.. అయితే, లోకేష్ .. ఎయిర్పోర్ట్కు వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతుండగా.. నేరుగా వెళ్లి ఆయన లోకేష్ వాహనంలో కూర్చుకున్నారు.. ఆ తర్వాత ఓకే వాహనంలో చంద్రబాబు నివాసానికి వెళ్లారు.. ప్రశాంత్ కిషోర్తో పాటు చంద్రబాబు నివాసానికి రాబిన్ శర్మ టీం సభ్యులు కూడా వచ్చినట్టు తెలుస్తోంది.. ఇక, చంద్రబాబుతో పీకే సమావేశం దాదాపు మూడు గంటల పాటు సాగింది.. ఆంధ్రప్రదేశ్లోని తాజా రాజకీయ పరిస్ధితులపై సుదీర్ఘంగా చర్చ సాగినట్టు సమాచారం.. ఇదే సమయంలో.. తాను చేసిన సర్వేల అంశాలను టీడీపీ అధినేతకు పీకే వివరించారట.. ఈ సమావేశంలో చంద్రబాబు, పీకేతో పాటు లోకేష్ కూడా పాల్గొన్నాడు.. మొత్తంగా ఏపీ రాజకీయ వర్గాల్లో చంద్రబాబు-పీకే భేటీ సంచలనం రేకెత్తిస్తోంది.
Read Also: Captain Miller: మన సినిమాలకే థియేటర్లు లేవంటే.. ధనుష్ కూడా సంక్రాంతికే!
కాగా, గత ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టడం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు బాగా పనిచేశాయి.. ఈ విషయాన్ని స్వయంగా సీఎం వైఎస్ జగన్ కూడా ప్రస్థావించారు.. తన పార్టీని గెలిపించిన పీకే టీమ్కు కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నారు.. గత ఎన్నికల్లో వైసీపీని విజయతీరాలకు చేర్చడమే కాదు.. ఆ తర్వాత నాలుగున్నరేళ్లుగా అక్కడ పరిస్థితులపై వైసీపీకి ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తూ వస్తున్నారు పీకే.. మరోవైపు.. తెలంగాణలో కేసీఆర్కు కూడా వ్యూహాలు అందిస్తారనే చర్చ సాగింది.. అందులో భాగంగా కేసీఆర్తో ప్రత్యేకంగా సమావేశాలు కూడా నిర్వహించారు ప్రశాంత్ కిషోర్.. కానీ, ఏమైందో ఏమో కానీ.. అది పట్టాలు ఎక్కలేదు.. కానీ, ఆ తర్వాత హైదరాబాద్ సహా తెలంగాణలో ఉన్న తన టీమ్ మొత్తాన్ని ఏపీకి షిప్ట్ చేసి అక్కడ వైసీపీకే పూర్తిస్థాయిలో సేవలు అందిస్తూ వచ్చారు.. ఈ మధ్యే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్.. మంత్రులు, ఎమ్మెల్యేల స్థానాలను మార్చడం వెనుక కూడా పీకే ఇచ్చిన నివేదికే కారణం కావొచ్చు అనే చర్చ సాగుతోంది.. ఈ సమయంలో.. ఉన్నట్టుండి ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు చంద్రబాబుతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.. మరి వైఎస్ జగన్-పీకేకు ఎందుకు చెడింది.. ఇకపై తన వ్యూహాలను టీడీపీ గెలుపుకోసమే పీకే అందించనున్నారా? అనేది చర్చగా మారింది. మరి కొన్ని రోజుల్లో ఎన్నికలకు రానున్న తరుణంలో వైఎస్ జగన్కు పీకే షాక్ ఇస్తారా? అనేది సంచలనంగా మారింది.