ఊహించని విధంగా ఆ మాజీ ఎమ్మెల్యే అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారా ? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సదరు నేతకు…టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు అండగా ఉంటారా ? తమను కాదని టికెట్ ఇవ్వడంతో…పార్టీలకు అతీతంగా ఏకమైన నేతలు రెబెల్స్గా బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారా ? అన్న పోతే తమ్ముడు…తమ్ముడు పోతే అన్నకు జై కొట్టడానికి టీడీపీ కేడర్ సిద్ధంగా ఉందా ? లేదా ? ఆ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె నియోజకవర్గం టిడిపికి కంచుకోట. అలాంటి చోట అభ్యర్థి ఎంపిక వివాదాన్ని రేపుతోంది. నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలుగా పార్టీ క్యాడర్ డక్కీలు మొక్కీలు తిని రాజకీయపోరాటం చేస్తున్నారు. పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల లిస్టు చాలా పెద్దదే. ఇలాంటి సమయంలో మదనపల్లి అభ్యర్థిగా…కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు టికెట్ ఇచ్చింది. రాష్ట స్థాయి నాయకుడు మద్దతుతో షాజహాన్…మదనపల్లి టికెట్ తెచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కడి నేతలు అధిష్ఠానం మీద గుర్రుగా ఉన్నారట. ఇటు నేతలు…అటు కేడర్ ఎప్పుడూ లేనంతగా రగిలిపోతున్నారనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఇన్నేళ్ళు పార్టీ కోసం కష్టపడి పడి పని చేసిన వారిని కాదని…కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఎంటని కొందరు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు అన్నపోతే తమ్ముడు…తమ్ముడు పోతే అన్న ఎమ్మెల్యేగా గెలిపించాలా అన్న డైలాగ్లు కేడర్ నుంచి వస్తున్నాయట. ఇది కాస్తా పార్టీ పెద్దల దృష్టి కెళ్ళినట్లు సమాచారం. షాజహన్ కుటుంబానికి టిడిపి సీటు ఇవ్వడంపై పార్టీ కేడర్లో భిన్నమైన వాదనలు వస్తుంటే…నేతలు మాత్రం అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదని పెద్దలు చెప్పినట్లు టాక్ నడుస్తోందట.
తెలుగుదేశం పార్టీ షాజహాన్కు టికెట్ ఇవ్వడంతో…2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన టిడిపి అభ్యర్ది దొమ్మలపాటి రమేష్, 2019లో జనసేన నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రాందాస్ చౌదరి ఆశలపై నీళ్ళు చల్లినట్లు అయింది. దీంతో రెండు రోజుల పాటు మౌనంగా ఉన్న వీరిద్దరూ…ఇక లాభం లేదనుకుని బిజెపి నేత బండి అనంద్ ఇంట్లో రహస్య సమావేశం నిర్వహించారట. వీరితో పాటు మండలస్థాయి నాయకులు, డివిజన్ స్థాయి నాయకులు హాజరయ్యారు. 2019 నుంచి ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల నిర్వహాణతో పాటు అనేక కేసులు ఎదుర్కొన్నామని, తమకు అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారట. దీనికి తోడు సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషా సోదరుడైన షాజహాన్ బాషాకు ఇవ్వడం తెలుగుదేశం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో సోదరుడి ప్రభావం ఖచ్చితంగా పడుతుందని…ఓడిపోయే అవకాశం ఉందని టికెట్ ఆశించిన నేతలు చెబుతున్నారు.
గత ఐదేళ్ల కాలంలో నవాజ్ బాషా వ్యవహారించిన తీరు…టిడిపి నేతలపై కేసులు పెట్టించడం, టార్గెట్ చేస్తూ వేధించడాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారట. వైసీపీనే టికెట్ ఇవ్వకుండా బయటకు పంపి…బలమైన మైనార్టీ నేత నిస్సార్ ఆహ్మాద్కు అవకాశం ఇచ్చిందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షాజహాన్ ఎలా గెలుస్తారని విషయాన్ని నేతలు ప్రస్తావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్కు చెప్పాలని నేతలంతా ఏకగ్రీవంతా తీర్మానం చేశారు. అధిష్టానం నుంచి పిలుపు వస్తే సరే…లేక పోతే టిడిపి, జనసేన, బిజెపి నాయకులతో కలసి ఎవరికి వారు రెబల్స్ బరిలో దిగడానికి సై అంటున్నారట. ఇలా ముగ్గురు నేతలు పోటీకి దిగితే…తన పరిస్థితి ఎంటని షాజహాన్ బాషా టెన్షన్లో పడుతున్నట్లు తెలుస్తోంది. రెబల్స్ గొడవను పార్టీ ఎలా డిల్ చేస్తుంది… తమ్ముడు ఎఫెక్ట్ అన్నమీద లేకుండా ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోందన్నది ఆసక్తికరంగా మారింది.