Off The Record: ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ సీఎం జగన్ మీద రాయి దాడి ఘటన. ఇందులో ఎవరి వాదన ఎలా ఉన్నా… పోలీసులు మాత్రం సీఎంకు ప్రాణహాని తలపెట్టేందుకే ఆ రాయి విసిరినట్టు క్లారిటీ ఇచ్చేశారు. రాయి విసిరింది సతీష్ అనే కుర్రాడైతే.. దాని వెనుక ఉంది టీడీపీ బీసీ సెల్ నేత అని దాదాపు ఓ నిర్ధారణకు వచ్చేసినట్టే కన్పిస్తోందంటున్నారు పరిశీలకులు. అంత సెక్యూరిటీ ఏం చేస్తోందని ముందు విమర్శలు వచ్చినా… రెండు రోజుల వ్యవధిలోనే నిందితుణ్ని పట్టేసుకున్నారు ఏపీ పోలీసులు. సీఎం జగన్ను చంపడానికే రాయి విసిరారని రిమాండ్ రిపోర్టులో కూడా రాసేశారు. దీంతో.. ఇప్పుడు ఈ వ్యవహారం అటు తిరిగి.. ఇటు తిరిగి తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే ఆందోళన టీడీపీ వర్గాల్లో పెరుగుతోందట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం అంటే మామూలు విషయం కాదు. మొన్నటి వరకు నిందితుడి ఎవరో తెలీదు.. ఎవరో రాయి విసిరారు.. అది కూడా సరిగా కన్పించ లేదు… ఇదంతా ట్రాష్.. ఒట్టి డ్రామా అని కొట్టిపారేసిన టీడీపీ నేతల్లో.. ఇప్పుడు నిందితుడు దొరకడంతో టెన్షన్ మొదలైందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
జగన్కు తగిలిన రాయిని గుర్తించడమే కాకుండా.. ఆ కుర్రాడు కూడా టీడీపీ నేత ప్రోద్భలంతోనే విసిరాడన్న నిర్ధారణకు వచ్చి.. రిమాండ్ రిపోర్టులో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడంతో ఇప్పుడు టీడీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయట. సీఎం రోడ్ షోకు వస్తే డబ్బులిస్తామని చెప్పి.. ఇవ్వకపోవడం వల్ల రాయి విసిరారనే ప్రచారం జోరుగా సాగింది. అలాగే డబ్బులిచ్చి రోడ్ షోకు తీసుకెళ్లారని.. అసలు డబ్బుల కోసం ఆశపడకుంటే.. తమ మీద.. తమ పిల్లల మీద ఈ నింద పడేది కాదంటూ నిందితుల కుటుంబ సభ్యులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. కానీ.. ఇప్పుడు సీన్ మారిపోయింది. రాయి విసిరింది సీఎంని చంపడానికేనని పోలీసులు తేల్చేయడంతో మళ్లీ మనకు ముప్పు తప్పదా అనే చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోందట. కోడికత్తి వల్ల గత ఎన్నికల్లో ఎంత డ్యామేజ్ జరిగిందో గుర్తు చేసుకుంటూ.. ఈసారి ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడటం ఎలాగంటూ టీడీపీ లీడర్స్ లెక్కలేసుకుంటున్నట్టు తెలిసింది. ఏ మాత్రం తేడా జరిగినా.. అసలుకే మోసం వస్తుందన్న ఆందోళనలో తెలుగుదేశం ఉన్నట్టు తెలిసింది.
అసలా రాయి ఎపిసోడ్ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న భావన ఓవైపు వ్యక్తం అవుతున్నా.. మరోవైపు కీడెంచి మేలెంచాలన్న సామెతను గుర్తు చేసుకుంటున్నట్టు కూడా మాట్లాడుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. ఇప్పటికే రకరకాల తలనొప్పులతో సతమతం అవుతున్న పార్టీకి ఈ రాయి ఎపిసోడ్ మరో నొప్పిగా మారే ప్రమాదం ఉన్నందున ఆ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటున్నాయట టీడీపీ శ్రేణులు. ఈ క్రమంలో కోడికత్తి ఎపిసోడ్ని మరోసారి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేయడంతోపాటు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైన అంశాలు, నిందితుడు శ్రీను ఐదేళ్ల పాటు జైల్లో ఉన్న వ్యవహారంపై విస్తృత చర్చ పెట్టాలని టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు.. గతంలో టీడీపీని టార్గెట్ చేసుకుంటూ వైసీపీ ఏయే అంశాలను ప్రస్తావించింది.. ఆ తర్వాత వాటిలో నిజాలు, అబద్దాల సంగతేంటి అంటూ మరోసారి జనం మీదికి ప్రశ్నల్ని సంధించే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలిసింది. వీలైనంత వరకు ఆ రాయి దెబ్బ తమకు తగలకుండా కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందట టీడీపీ. ఇదే సందర్భంలో అబద్దం.. వాస్తవం.. అనే పేరుతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక పోలీసు ఉన్నతాధికారుల వ్యవహార శైలి, ప్రత్యేకించి బెజవాడ సీపీ కాంతి రాణా తాతా తీరును, ఆయనకు సంబంధించిన లోగుట్టు వ్యవహారాలను తెర మీదకు తెచ్చే ప్రయత్నం జరుగుతోందన్నది టీడీపీ ఇంటర్నల్ టాక్.