బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కుమారుడి రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అది నెరవేరబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో రాజ్యసభ ఎన్నికల సందడి నడుస్తోంది.
ఈ నేపథ్యంలో బీహార్ నుంచి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జేడీయూ నుంచి రాజ్యసభకు పంపబడటం ఖాయంగా వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే నితీష్ కుమార్ నుంచి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
బీహార్ నుంచి రాజ్యసభ అభ్యర్థుల జాబితాను ఎన్డీఏ కూటమి దాదాపుగా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. బీజేపీ నుంచి శివేష్ రామ్, పవన్ సింగ్లు బరిలోకి దింపబోతుండగా.. జేడీయూ నుంచి రామ్నాథ్ ఠాకూర్, నిశాంత్ కుమార్, ఆర్ఎల్ఎం (రాష్ట్రీయ లోక్ మోర్చా) నుంచి ఉపేంద్ర కుష్వాహా పేర్లను పరిశీలించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దల సభలోకి ఎంట్రీతో నిశాంత్ రాజకీయ ప్రవేవం చేయబోతున్నట్లుగా సమాచారం.
రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్ల ద్వారా ఎన్నికవుతారు. ప్రస్తుతం అసెంబ్లీలో కూటమి బలంగా ఉంది. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని అందుకుంది. 202 స్థానాలు కైవసం చేసుకుంది. ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 41 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. అందువల్ల ఎన్డీఏ నాలుగు సీట్లు గెలుచుకోవడం దాదాపు ఖాయమని భావిస్తున్నారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోతే ఎన్డీఏ ఐదవ సీటు కూడా గెలుచుకోవచ్చని అంటున్నారు.