విమాన ప్రయాణమన్నా.. ట్రైన్ ప్రయాణాలన్నా.. కొద్ది రోజులు ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలి. లేదంటే ప్రయాణం సాఫీగా సాగదు. అయితే కొన్ని సార్లు రిజర్వేషన్ అయ్యాక కూడా విమానాలు, ట్రైన్స్ క్యాన్సిల్ అవుతుంటాయి. దీంతో టికెట్ డబ్బులు తిరిగి రావాలంటే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ అమెరికా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. విమానాల రద్దు, దారి మళ్లింపు వంటి సమయాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే.. సులభతరంగా డబ్బులు రిఫండ్ అయ్యేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కార్పొరేట్ల అనవసరపు రుసుముల బాదుడు నుంచి కస్టమర్లను రక్షించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్ కార్యవర్గం తెలిపింది. కరోనా సమయంలో ఎయిర్లైన్స్ సంస్థలు మనీ రిఫండ్ చేసే విషయంలో ఇబ్బందులకు గురి చేశాయి. దీంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఇకపై ఇలాంటి తలనొప్పులు రాకుండా ఉండేందుకు బైడెన్ సర్కార్ కొత్త రూల్స్ తీసుకుచ్చింది.
రూల్స్ ఇవే..
ప్రయాణికులు ప్రత్యేకంగా అభ్యర్థించకపోయినా వారికి అందించాల్సిన రిఫండ్లను ఆటోమేటిక్గా చెల్లించాలి. క్రెడిట్ కార్డు ద్వారా సేవలు కొనుగోలు చేసిన వారికి ఏడు పని దినాలు, ఇతర మార్గాల్లో చెల్లించిన వారికి 20 రోజుల్లో రిఫండ్ చేయాలి. కొనుగోలు సమయంలో వారు ఏ మాధ్యమం ద్వారా చెల్లించారో అదే రూపంలో వారికి తిరిగివ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా వోచర్లు, ట్రావెల్ కార్డులు ఇతరత్రా రూపంలో పరిహారం ఇవ్వడానికి వీల్లేదు. ప్రయాణికుడు విధిగా అభ్యర్థిస్తే మాత్రం వారు కోరుకున్న విధంగా ఇవ్వొచ్చు.
కోతలు విధించొద్దు..
విమానయాన సంస్థలు, టికెట్ ఏజెంట్లు రిఫండ్కు ఎలాంటి కోత వేయొద్దు. ఏమైనా సేవలు వినియోగించుకొని ఉంటే దాని వరకు మాత్రమే ఛార్జ్ చేసి మిగిలిన మొత్తాన్ని వాపస్ చేయాలి. అలాగే లగేజీ, రిజర్వేషన్ మార్పు లేదా రద్దుపై ఎంత తీసుకుంటారో ముందే తెలియజేయాలి. తద్వారా ఎలాంటి రుసుములు చెల్లిస్తున్నారో కస్టమర్లకు అవగాహన ఉంటుంది. పైగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై ఆయా ఫీజులను నేరుగా కనిపించేలా చూపించాలి. ప్రత్యేక హైపర్లింక్ల రూపంలో ఇవ్వకూడదు. లగేజీ బరువు, పరిమాణం.. వీటిని బట్టి విధించే ఛార్జీని విధిగా పేర్కొనాలి. ఇక పలు సేవల పేరిట విమానయాన సంస్థలు అదనపు రుసుములు వసూలు చేస్తున్నాయి. పైగా వాటిని ప్రయాణికులకు తెలియజేయడం లేదు. తీరా చెల్లింపులు చేసేటప్పుడు వివిధ రకాల ఛార్జీలను చూసి వారు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అలాగే విమానాల రద్దు, మార్గం మళ్లింపు సమయంలో ప్రయాణం రద్దు చేసుకొని రిఫండ్ కోరితే.. వివిధ ఛార్జీల పేరిట కొంత మొత్తాన్ని కత్తిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటన్నింటికీ చెక్ పెట్టడం కోసం అమెరికా ఈ నిబంధనలు తీసుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Election Phase 2: రేపు రెండో విడత పోలింగ్.. రాహుల్ గాంధీ, శశిథరూర్తో పాటు పోటీలో కీలక వ్యక్తులు..