తొలిసారి లోక్సభలో స్పీకర్పై పోటీ నెలకొంది. ఎన్డీఏ కూటమిపై ఇండియా కూటమి పోటీ చేసింది. చివరికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికయ్యారు. మోడీ ప్రభుత్వంలో రెండోసారి ఓం బిర్లా స్పీకర్ స్థానంలో కూర్చున్నారు. అయితే ఓం బిర్లా.. స్పీకర్ సీటులో కూర్చోగానే ఇందిరాగాంధీ హయాం నాటి ఎమర్జెన్సీని గుర్తుచేసుకుని రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని ప్రకటించారు. దీంతో ఈ ప్రకటనతో విపక్షాలు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. స్పీకర్ ఓం బిర్లా తీరును తప్పుపట్టాయి. సభలో గందరగోళం నెలకొనడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.
అంతకముందు స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక కాగానే.. ఓం బిర్లాను స్పీకర్ సీటులోకి తీసుకెళ్లేందుకు ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ వెళ్లారు. ఈ సందర్భంగా మోడీ-రాహుల్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో సభలో సభ్యులు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. అయితే స్పీకర్ ప్రసంగంపై మాత్రం కాంగ్రెస్ సహా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఓం బిర్లా ఏం మాట్లాడుతూ.. 1975, జూన్ 25 మన దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందన్నారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించారని గుర్తుచేశారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారన్నారు. ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టారని.. మీడియాపై ఆంక్షలు విధించారన్నారు. యావత్ దేశం కారాగారంగా మారిపోయిందని స్పీకర్ గుర్తుచేశారు. నాటి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించడాన్ని సభ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం అత్యయిక స్థితిని ఎదిరించిన వారిని తాము అభినందిస్తున్నామని ఓం బిర్లా అన్నారు. అనంతరం నాటి చీకటి రోజులకు నివాళిగా సభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటిద్దామని సభ్యులను కోరారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. స్పీకర్ మాట్లాడుతున్న సమయంలో మాత్రం కాంగ్రెస్ సహా విపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశారు.