హైబిజ్ హెల్త్ కేర్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని హెచ్ఐసీసీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెటరన్ క్రికెటర్ కపిల్ దేవ్తో కలిసి మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన డాక్టర్లకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కరోనా సమయంలో వైద్యుల సేవలు వెలకట్టలేనివన్నారు. హైదరాబాద్ ఐటీ, వాక్సినేషన్ హబ్గా ఉందని, రానున్న రోజుల్లో మెడికల్ టూరిజం హబ్గా మారనుందని ఆయన అన్నారు. ఇప్పటికే ఆఫ్రికా, ఆసియా, గల్ఫ్ దేశాల నుండి, మన దేశంలో అన్ని రాష్ట్రాల నుండి హైదరాబాద్లో మెడికల్ సేవలు కోసం వస్తున్నారన్నారు.
ప్రతీ రోజు నాలుగైదు ఎయిర్ అంబులెన్స్లు హైదరాబాద్కు వస్తున్నట్లు చెబుతున్నారని, కపిల్ దేవ్కి నేను పెద్ద ఫ్యాన్ అని ఆయన అన్నారు. చదువుకునే రోజుల్లో తెల్లవారు జామున ఐదు గంటలకు లేచి ఆస్ట్రేలియా మ్యాచ్లు చూసేవాడినని, ఇవాళ కపిల్ దేవ్తో ఈ వేదిక పంచుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అనంతరం కపిల్ దేవ్ మాట్లాడుతూ.. గోల్ఫ్ మంచి క్రీడ హరీష్ రావు కూడా గోల్ఫ్ ఆడాలని కోరుతున్నా.. హైదరాబాద్ లో గోల్ఫ్ కోర్సులున్నాయి. క్రికెట్, గోల్ఫ్ అనేకాదు..ఏదో ఒక ఆట ఆడండి అని ఆయన వ్యాఖ్యానించారు.