Kakani Govardhan Reddy: ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణిలో వ్యవహరించిందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. పోలీస్ అధికారులను ఉద్దేశ పూర్వకంగా బదిలీ చేసిందన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ అధికారులు ఉద్రిక్తతలు రెచ్చగొట్టారని.. వైసీపీ బలంగా ఉన్న చోట క్యాడర్ని భయబ్రాంతులకు గురి చేశారన్నారు. మాచర్ల ఘటన వీడియో ఎలా బయటికి వచ్చిందో చెప్పలేని దుస్థితిలో ఎన్నికల కమిషన్ ఉందన్నారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని మా అభిప్రాయమన్నారు.
Read Also: Perni Nani: ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.. పేర్ని నాని ఆగ్రహం
నెల్లూరు జిల్లాలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేదని.. ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఘోరంగా విఫలమైందన్నారు. ఎన్నికల నిధుల దుర్వినియోగం, విధుల నిర్వహణలో వైఫల్యంపై జిల్లా రిటర్నింగ్ అధికారిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశామన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి పట్టపగలు ఓటర్లకి డబ్బులు పంచారని.. దానిపై ఫిర్యాదు చేస్తే జిల్లా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని అన్నారు. మానవతా దృక్పధంతో సోమిరెడ్డి డబ్బులు పంచాడని జిల్లా ఎన్నికల అధికారి చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తానన్నారు. జిల్లా కలెక్టర్ పక్షపాత ధోరణిలో పని చేశారని మంత్రి అన్నారు. జిల్లా రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతుందనే నమ్మకం మాకు లేదన్నారు. కౌంటింగ్ నిర్వహణకు ఒక అబ్జర్వర్ను నియమించాలని కోరుతున్నామని మంత్రి పేర్కొన్నారు.