ఇటీవల సీఎం కేసీఆర్ నూతన ఫించన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో తాజాగా.. నేడు సూర్యాపేట జిల్లాలో నూతన ఆసరా ఫింఛన్ల లబ్దిదారులకు ఫించన్లను పంపిణీ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ సొంత రాష్ట్రంలో ఆసరా ఫించన్ 750 రూపాయలే అన్నారు. అంతేకాకుండా.. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇచ్చేది 600 రూపాయలేనని, రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణాలోనూ ఇచ్చింది సాలీనా 800 కోట్లే అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఇస్తున్నది 12,000 కోట్లు అని ఆయన వెల్లడించారు. 25 వేల కోట్ల ఋణమాఫీ చేసింది ఒక్క తెలంగాణాలోనేనని ఆయన తెలిపారు. అయితే.. డబుల్ ఇంజిన్లకు తెలంగాణా ఫించన్లు ట్రబుల్ ఇస్తున్నాయంటూ ఆయన సెటైర్లు వేశారు. ప్రజలు తిరగబడతారన్న భయం బీజేపీని వెంటాడుతుందని, అందుకే కేంద్రం నుండి రావాల్సిన నిధులకు అడ్డుపుల్లలు వేస్తున్నారన్నారు.
ముక్కు పిండి వసూలు చేసిన పన్నుల్లో వాటా తిరిగి చెల్లించడం లేదని, అయినా కొత్తగా పది లక్షల మందికి ఫించన్లు అందిస్తున్నామన్నారు. వృద్దులకు, వితంతువులతో పాటు ఒంటరి మహిళలకు 2,016 రూపాయలు, దివ్వాంగులకు 3,016 రూపాయలు ఫించన్ ఇస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. 10 లక్షల ఫించన్లను కలుపుకుని మొత్తం తెలంగాణా రాష్ట్రంలో46 లక్షల మంది లబ్దిదారులకు ఫించన్లు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని ఆయన అన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో కరెంట్ సరఫరా కేవలం ఆరు గంటల మాత్రమేనని, అక్కడ అరనిమిషం కుడా ఉచిత విద్యుత్ ఇవ్వకపోగా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి రీడింగ్ ప్రకారమే రైతాంగం నుండి ముక్కు పిండి మరీ విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు.