Minister Harish Rao Fired on BJP Government.
మెదక్ జిల్లా కేంద్రంలో నూతన రేక్ పాయింట్ను మంత్రి హరీష్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేక్ పాయింట్ ఎన్నో ఏండ్ల కల అని ఆయన వ్యాఖ్యానించారు. 2004లో ఉమ్మడి మెదక్ జిల్లా మీటింగ్ అప్పుడు రేక్ పాయింట్ గురించి చర్చ జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ రైల్వే లైన్ తెచ్చామని ఆయన వెల్లడించారు. మన రాష్ట్ర వాట కట్టి ఈ లైన్ తెచ్చినమని, ఎరువుల కోసం ఇక సనత్ నగర్ పోనక్కర్లేదన్నారు. పండిన వడ్లు ఇక్కడి నుంచి దేశంలో ఎక్కడికైనా పంపొచ్చన్నారు మంత్రి హరీష్రావు. ఉప ఎన్నిక తెస్తా అని బీజేపీ చెబుతుందని, ఎందుకు ఉప ఎన్నిక, ఆనాడు గడ్డిపొరకల్లాగా మేము మా పదవులు త్యాగం చేసినమని, మా త్యాగం తెలంగాణ పోరాటం కోసమని, మీ ఉప ఎన్నిక రాజకీయ ఉపేక్ష, రాజకీయ ఆరాటం కోసమని ఆయన వ్యాఖ్యానించారు. వరంగల్ కి కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని, బయ్యారంకి ఉక్కు ఫ్యాక్టరీ లేదని, ఉపాధి హామీ పథకం కోసం మనిషికి మెషిన్ లు పెడుతారట అంటూ ఆయన మండిపడ్డారు. గ్యాస్ సబ్సిడీ తీసేశారని మండిపడ్డ హరీష్రావు.. ఉన్న ఉద్యోగాలు పోయినయి అంటూ ధ్వజమెత్తారు. మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వండని ఆయన వ్యాఖ్యానించారు.