Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: మార్పు పేరుతో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. తెలంగాణ రైతాంగం పట్ల నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా దళారులు ప్రభుత్వం రైస్ మిల్లర్ల చేతిలో రైతులు విల విల లాడుతున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం చేతకాని తనం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మంత్రులు ఏసీ రూముల్లో గడిపారని.. తమ ఎంపీలు, ఎమ్మెల్యేలు రైతుల దగ్గరికి వెళ్ళే వరకు మేలుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానం గతంలో ఎలా ఉండేదో ఇప్పుడు అలానే ఉందని విమర్శించారు. రైతుల దగ్గర నుంచి కేంద్రం నేరుగా కొనదు.. మీ దద్దమ్మ తనం కేంద్రం మీద మోపుతున్నారని మండిపడ్డారు. దొడ్డు బియ్యం పండించే రైతుల పరిస్థితి ఏంది? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రైతులతో ఆడుకుంటున్నాయని.. ఈ ప్రభుత్వానికి కాంట్రాక్టులు, కమీషన్లు, భూ దందాల మీద ఉన్న దృష్టి రైతుల మీద లేదని విమర్శించారు. ఆ మంత్రి ఎంత ఈ మంత్రి ఎంత కమీషన్ తీసుకున్నారు.. నేనెంత తీసుకోవాలని చర్చిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

దేశ వ్యాప్తంగా విపరీతంగా ధాన్యం ఉత్పత్తి జరిగిందని.. ఎక్కడ గోదాంలు ఖాళీగా లేవని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. “విదేశాలకు సప్లై చేయాలి అంటే ఫెస్టిసైడ్ వాడ కూడదు. క్షేత్ర స్థాయిలో ఆర్గానిక్ ఫార్మింగ్‌పై అవగాహన కల్పిస్తుందా? రైతుల ఉసురు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సమస్య ఎందుకు లేదు. 6 నెలల ముందు గన్ని బస్తాలు తెచ్చుకుంటే ఏమయ్యింది. ఇక్కడ పండే సన్న బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తున్నారు. ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. తక్కువ ధరకు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి ఇక్కడ నాశి రకం సన్న బియ్యాన్ని పేద ప్రజలకి అందిస్తున్నారు. పేదలను, రైతులను మోసం చేస్తున్నారు. అందరికీ కేంద్రాన్ని విమర్శించడం అలవాటు అయింది. ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ ధాన్యాన్ని తెలంగాణ నుంచి కేంద్రం తీసుకుంది. ఈ ప్రభుత్వం రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని అనుకుంటుంది. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ప్రధాని పదేపదే చెపుతున్నారు. ధాన్యం సేకరణపై కేంద్రం గతంలో 9 సార్లు పొడిగింపు ఇచ్చింది. ఎప్పుడూ ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయలేదు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కు అయ్యారు. గతంలో బీర్ఎస్ అదే పని చేసింది. కేంద్రం ఇప్పటి వరకు ఇచ్చిన కోటను పూర్తి చేయలేదు. 52.24 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రంతో ఒప్పందం జరిగింది. ఇప్పటి వరకు 51 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.” అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వివరించారు.

×
×
Ad