సాధారణంగా మంచి బ్రాండెడ్ షూ ధరించాలని ఎవరికి ఉండదు చెప్పండి..? అందుకే మార్కెట్లో వేల రూపాయల ధర పలికే స్పోర్ట్స్ షూస్ లేదా స్నీకర్స్ కనిపిస్తే కుర్రకారు నుంచి పెద్దల వరకు అందరూ వాటి వైపు ఆకర్షితులవుతుంటారు. అయితే ఇటువంటి బ్రాండెడ్ ఉత్పత్తులను కేవలం ఒక్క రూపాయికి మాత్రమే విక్రయిస్తామని పేర్కొన్నారు ఆ షాపు యజమానాలు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికల ద్వారా తీవ్రంగా ప్రచారం చేశారు. అనుకున్న విధంగానే జనాలు గుంపులు గుంపులుగా ఆ షాపు వద్దకు కదిలి వచ్చారు.
అసలేం జరిగింది?
కేరళంలోని కోజికోడ్లో ఉన్న ఒక షూ షాపు యజమానులు తమ వ్యాపారాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఒక వినూత్న ప్రచారానికి తెరలేపారు. కేవలం ఒక్క రూపాయికే బ్రాండెడ్ షూ అందిస్తామని వారు సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేశారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఈ వార్త దావానంలా వ్యాపించింది. వేల రూపాయల విలువైన షూస్ను కేవలం రూపాయికే ఇస్తున్నారనే సరికి జనం ఎగబడ్డారు.
Also Read:Andhra Pradesh Farmers: ఏపీ రైతులకు శుభవార్త.. వారికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు..
ఆదివారం ఉదయం నుంచే వేల సంఖ్యలో ప్రజలు సదరు షాపు వద్దకు చేరుకున్నారు. చూస్తుండగానే ఆ ప్రాంతమంతా ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. క్యూలైన్లు పాటించకపోవడంతో తోపులాట మొదలైంది. షాపు వద్ద పరిస్థితి బీభత్సంగా మారడమే కాకుండా.. సమీపంలోని ప్రధాన రహదారులన్నీ వాహనాలతో పూర్తిగా స్తంభించిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Also Read:Compensation: వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం.. ఎలా పొందాలంటే..
పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు భారీగా చేరుకున్న జనాలను చెల్లాచెదురు చేసి ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ముందస్తు అనుమతులు లేకుండా.. ప్రజా భద్రతను గాలికొదిలేసి ఇలాంటి ప్రమాదకరమైన ప్రచార స్టంట్లు నిర్వహించినందుకు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసినందుకు గాను సదరు షాపు యజమానులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు.