NTV Telugu Site icon

Bandi Sanjay Kumar: కేసీఆర్ వివరణ అహంకార పూరిత వైఖరికి నిదర్శనం: బండి సంజయ్

Bandi Sanjay

Bandi Sanjay

విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేస్తున్న జస్టిస్ నర్సింహరెడ్డిని అవమానించేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ ఆయన అహంకార పూరిత వైఖరికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. “ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కి రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్దంగా నియమించిన కమిషన్ కు కనీస గౌరవం ఇవ్వాలనే ఇంగిత జ్నానం లేకపోవడం సిగ్గు చేటు. చీఫ్ జస్టిస్ గా పనిచేసిన నర్సింహారెడ్డి విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై విచారణ చేస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేస్తే.. వాస్తవాలను ముందుంచాల్సిన కేసీఆర్ ఆ కమిషన్ నే అవమానించేలా లేఖ రాయడం క్షమించరానిది. తెలంగాణ ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఛీ కొట్టి ఓడించినా కేసీఆర్ లో అహంకారం తగ్గలేదు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్న కేసీఆర్ వాదనలో పస ఉంటే న్యాయస్థానానికి ఎందుకు వెళ్లలేదు? కోర్టులో తన వాదనలను ఎందుకు విన్పించలేదు? విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అనేక అక్రమాలపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ తన ద్రుష్టికి వచ్చిన సమాచారం ఆధారంగా వివిధ రూపాల్లో క్రాస్ ఎగ్జామిషన్ చేస్తుంది. అందులో భాగంగా అంతర్గతంగా, బహిరంగంగా విచారణ చేసే అధికారం ఆ కమిషన్ కు ఉంది. దీనిని తప్పుపట్టడం హాస్యాస్పదం.” అని తెలిపారు.

READ MORE: Kurnool: ప్రభుత్వాసుపత్రిలో క్షుద్ర పూజల కలకలం

ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) నిర్ణయాలను జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఇంతవరకు ఎక్కడా ప్రశ్నించలేదని.. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, దాని ఆధారంగా జరిగిన అనేక అవినీతి, అక్రమాలపైనే విచారణ జరుపుతోందే తప్ప ఈఆర్సీ పై కాదని బండి సంజయ్ ప్రకటన పేర్కొన్నారు. “ఈ విషయం తెలిసి కూడా కేసీఆర్ చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఈఆర్సీని వివాదంలోకి లాగి బదనాం చేయడం సిగ్గు చేటు. కేసీఆర్ తన లేఖలో తెలంగాణ బిడ్డ జస్టిస్ నర్సింహారెడ్డి అని సంబోధిస్తూనే ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పేర్కొనడం దుర్మార్గం. నర్సింహారెడ్డి తెలంగాణ బిడ్డ కాబట్టే ఆనాడు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ కేంద్రానికి జస్టిస్ శ్రీక్రిష్ణ కమిటీ పంపిన రహస్య నివేదికను బహిరంగ పర్చాలని ఆదేశాలు జారీ చేసి ఆ కమిటీలోని 8వ ఛాప్టర్ అంశాలను బట్టబయలు చేయించిన ధైర్యశాలీ జస్టిస్ నర్సింహారెడ్డి. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉంటూ పోరాడిన ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు బయటకు రాకుండా వర్శిటీ గేటు ఎదుట ముళ్లకంచెలు వేసి నిర్బంధిస్తే… ముళ్ల కంచెను తీసివేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ముద్దు బిడ్డ జస్టిస్ నర్సింహారెడ్డి. అలాంటి వ్యక్తి చిత్తశుద్ధిని శంకించేలా కేసీఆర్ గు వ్యవహరించడం, చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు వితండవాదం చేయడం సిగ్గు చేటు.” అని ప్రకటన ద్వారా వివరించారు.