Ishan Kishan: నిన్న జరిగిన ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కెప్టెన్గా జట్టును విజయ తీరం వైపునకు నడిపించడానికి తన వంతు కృషి చేశాడు ఇషాన్ కిషన్. వరుసగా వికెట్లు పడిపోతున్నా.. కేవలం 38 బంతుల్లో 80 పరుగులు చేసి జట్టుకు ఊపిరి పోశాడు. అయితే.. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఆరంభ మ్యాచ్లో కిషన్ కెప్టెన్గా టాస్కు వచ్చి సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో భారత్ అండర్-19 జట్టుకు కెప్టెన్గా ఉండి, ఇప్పుడు ఐపీఎల్ జట్టును నడిపిస్తున్న మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతే కాదు.. 27 ఏళ్ల 253 రోజుల వయసులో కెప్టెన్సీ చేపట్టిన కిషన్, ఎస్ఆర్హెచ్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ కెప్టెన్గా నిలిచాడు. గతంలో శిఖర్ ధావన్, మనీష్ పాండే, భువనేశ్వర్ కుమార్ మాత్రమే ఈ జట్టుకు నాయకత్వం వహించిన భారతీయులు. అయితే ఓవరాల్గా చూస్తే, 2018లో 27 ఏళ్ల 244 రోజులకే కెప్టెన్ అయిన కేన్ విలియమ్సన్ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. కిషన్కు తోడుగా యువ ఆటగాడు అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. కనీసం ఏడు మ్యాచ్ల పాటు ఈ యువ ద్వయం జట్టును నడిపించనుంది. 2016లో ముంబై ఇండియన్స్ తరఫున డైనమిక్ వికెట్ కీపర్-బ్యాట్స్మన్గా ఐపీఎల్లోకి దూసుకొచ్చిన ఇషాన్ కిషన్, అతి తక్కువ కాలంలోనే భారతదేశపు అత్యంత విధ్వంసకర ఓపెనర్లలో ఒకరిగా తనను తాను నిలబెట్టుకున్నాడు. గత సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, అతనిలోని నాయకత్వ లక్షణాలను గుర్తించి ఈ కీలక బాధ్యతను అప్పగించింది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్. 2025 మెగా వేలంలో రూ. 11.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన కిషన్పై యాజమాన్యం ఉంచిన నమ్మకాన్ని ఈ బాధ్యత ప్రతిబింబిస్తోంది.
ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2026 తొలి రాత్రి అభిమానులకు అసలైన టీ20 వినోదాన్ని పంచింది. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇంకా 26 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా, దేవదత్ పడిక్కల్ మెరుపు ఇన్నింగ్స్ ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనా, కెప్టెన్ ఇషాన్ కిషన్ కేవలం 38 బంతుల్లో 80 పరుగులతో విరుచుకుపడ్డాడు. అతనికి హెన్రిచ్ క్లాసెన్ (31) తోడవడంతో నాలుగో వికెట్కు 97 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదైంది. చివర్లో అనికేత్ వర్మ (18 బంతుల్లో 43) మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ 200 పరుగుల మార్కును దాటింది. ఆర్సీబీ బౌలర్లలో డెబ్యూ ప్లేయర్ జాకబ్ డఫీ (3/22) అద్భుతంగా రాణించగా, షెపర్డ్ కూడా మూడు వికెట్లు పడగొట్టాడు. భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే ఫిలిప్ సాల్ట్ వికెట్ కోల్పోయి షాక్ తగిలింది. అయితే, వన్ డౌన్లో వచ్చిన దేవదత్ పడిక్కల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 26 బంతుల్లోనే 61 పరుగులు చేసి మ్యాచ్ను ఆర్సీబీ వైపు తిప్పేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (69 నాటౌట్; 38 బంతుల్లో) ఎంతో సంయమనంతో ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి హైదరాబాద్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. పడిక్కల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన రజత్ పాటిదార్ (12 బంతుల్లో 31) రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివరలో విరాట్ కోహ్లీ తనదైన శైలిలో వరుస బౌండరీలతో మ్యాచ్ను ముగించాడు. 16వ ఓవర్లో హర్షల్ పటేల్ బౌలింగ్లో ఒక సిక్స్, వరుసగా మూడు ఫోర్లు బాది కోహ్లీ విజయాన్ని ఖాయం చేశాడు. ఐపీఎల్లో కోహ్లీకి ఇది 64వ అర్ధశతకం కావడం విశేషం.