IND vs NZ: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ నేడు దుబాయ్లో జరుగుతోంది. ఈ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గ్రూప్-A నుండి ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీఫైనల్స్లో తమ స్థానాన్ని ఖరారు చేసుకున్నాయి. దింతో గ్రూప్ స్టేజిలోనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు టోర్నమెంట్ నుండి నిష్క్రమించాయి. భారత క్రికెట్ జట్టు రోహిత్ శర్మ నాయకత్వంలో తొలిప్రత్యర్థి బంగ్లాదేశ్పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత పాకిస్తాన్ మ్యాచ్ లోను 6 వికెట్ల తేడాతో ఓడించి సెమీఫైనల్ చేరింది. న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ నేతృత్వంలో తన మొదటి మ్యాచ్లో పాకిస్తాన్ను 60 పరుగుల తేడాతో, రెండవ మ్యాచ్లో బంగ్లాదేశ్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది.
ప్రస్తుతం గ్రూప్-Aలో భారత్, న్యూజిలాండ్ చెరో 4 పాయింట్లతో సమంగా ఉన్నాయి. అయితే, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా న్యూజిలాండ్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్ నికర రన్ రేట్ 0.863 ఉండగా, భారతదేశం నికర రన్ రేట్ 0.647 మాత్రమే ఉంది. ఈరోజు జరిగే మ్యాచ్లో రెండు జట్లు అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్లో సులువైన ప్రత్యర్థిని ఎదుర్కోవాలని చూస్తున్నాయి. ఇక వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్ 118 మ్యాచ్లు ఆడగా.. భారత్ 60 మ్యాచ్ల్లో గెలిచింది. న్యూజిలాండ్ 50 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగియగా, 7 మ్యాచ్లకు ఫలితం రాలేదు.
Read Also: Posani Case : సబ్ జైలుకు పోసాని.. నిలకడగా ఆరోగ్యం.
ఇక నేడు జరిగే మ్యాచ్ లో గెలిచిన జట్టు గ్రూప్ స్టేజి లో అగ్రస్థానంలో నిలబడుతుంది. టేబుల్ టాపర్ జట్టు గ్రూప్-Bలో రెండవ స్థానంలో ఉన్న జట్టుతో సెమీఫైనల్లో తలపడుతుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు మంచి ఫామ్లో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్లో జరిగిన వన్డే ముక్కోణపు సిరీస్ను గెలుచుకున్న ఆ జట్టు, ఈ మ్యాచ్లో విజయాన్ని సాధించలని భావిస్తోంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు మాత్రమే కాకుండా, అభిమానులకు కూడా రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. గ్రూప్ దశను అగ్రస్థానంలో ముగించాలనే ఉద్దేశంతో భారత్, న్యూజిలాండ్ జట్లు మ్యాచ్లో బలమైన ప్రదర్శన ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.