Kukatpally 1 Crore Robbery: హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో భారీ దోపిడీ కలకలం రేపింది. సోమవారం రాత్రి సుమారు 9:40 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో స్కూటీపై డబ్బులు తరలిస్తున్న ఇద్దరిపై దుండగులు దాడి చేసి కోటి రూపాయల నగదును దోచుకెళ్లారు. ఈ సంఘటన కూకట్పల్లి పిలర్ నెంబర్ 825 సమీపంలో, ఏసీపీ కార్యాలయం పక్కనే జరగడం మరింత సంచలనంగా మారింది.
పోలీసుల వివరాల ప్రకారం… మహ్మద్ ఖుస్రూ (42), మహ్మద్ అజీముద్దీన్ (38) అనే ఇద్దరు వ్యక్తులు స్కూటీపై కోటి రూపాయల నగదును తరలిస్తున్నారు. వీరు బహదూర్పురాకు చెందిన ఏసీ మెకానిక్స్. అనుమానం రాకుండా ఉండేందుకు గోల్డ్ డ్రాప్ కార్టన్ బాక్స్లో కోటి రూపాయలను పెట్టుకుని బైక్పై తరలించే ప్రయత్నం చేశారు. కూకట్పల్లి పిల్లర్ నెంబర్ 825 వద్ద ఏజెంట్లు డబ్బు కలెక్ట్ చేసుకున్నారు. అయితే వీరిని ముందుగానే గమనించిన దుండగులు మూడు బైక్లపై ఫాలో అయ్యారు. డబ్బు కలెక్ట్ చేసుకుని కేవలం 100 మీటర్ల దూరం ప్రయాణించగానే.. నలుగురు దుండగులు స్కూటీపై వెళ్తున్న వారిపై కారం పొడి చల్లి దాడి చేశారు. దీంతో బాధితులు కింద పడిపోగా.. వెంటనే నగదు ఉన్న బాక్స్ను తీసుకుని దుండగులు పరారయ్యారు.
Also Read: Rajinikanth Fans: రజనీకాంత్కు క్షమాపణలు చెప్పాల్సిందే.. లేదంటే విజయ్కి ఓట్లు పడకుండా చేస్తాం!
ఈ ఘటనలో ఉపయోగించిన బైక్లు ప్యాషన్ ప్లస్, ఎఫ్జెడ్ మోడల్స్గా పోలీసులు గుర్తించారు. డబ్బు హవాలా నగదై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అలాగే డబ్బు తరలింపు సమాచారం ముందుగానే తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన అనంతరం పోలీసులు బాధితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరిది? వంటి వివరాలను సేకరిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో నగరంలో భద్రతా వ్యవస్థపై మరోసారి చర్చ మొదలైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.