పంజాబ్లో, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్, అతడి సహచరులకు సంబంధించిన 9 ప్రదేశాలపై దాడులు చేసింది. దోపిడీ, కాల్పుల కేసుకు సంబంధించిన కేసులో రైడ్ నిర్వహించిన ఎన్ఐఏ డిజిటల్ పరికరాలతో సహా అభ్యంతరకరమైన వస్తువులు, ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. చండీగఢ్లోని ఓ బాధితురాలి ఇంట్లో దోపిడీ, కాల్పులకు సంబంధించిన కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 20న స్థానిక పోలీసులు కేసు నమోదు చేయగా, మార్చి 18న ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది.
READ MORE: Delhi: నకిలీ ఆధార్ తో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు యత్నం.. ముగ్గురు కూలీల అరెస్ట్
గోల్డీ బ్రార్, రాజ్పురాకు చెందిన గోల్డీ అనే అసోసియేట్తో కలిసి పంజాబ్, చండీగఢ్, చుట్టుపక్కల ప్రాంతాల వ్యాపారవేత్తల నుంచి డబ్బు వసూలు చేసేందుకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. బ్రార్ సృష్టించిన ఉగ్రవాద ముఠాలకు వారు ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని కూడా అందించారు. మొహాలి, పాటియాలా, హోషియార్పూర్, ఫతేఘర్ సాహిబ్ జిల్లాల్లో దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహించింది. విదేశాల్లో నివసిస్తున్న గోల్డీ బ్రార్, అతడి సహచరులు బలహీనమైన యువకులను తమ ముఠాలోకి చేర్చుకున్నారని NIA తెలిపింది.
దర్యాప్తు సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం.. సతీందర్జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్, అతని ముఠా గురించి సమాచారం కోసం ప్రజల నుంచి సహాయం కూడా కోరుతోంది. గత ఏడాది జైపూర్లో కర్ణి సేన అధినేత సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో గోల్డీ బ్రార్తో పాటు మరో 11 మంది నిందితులపై ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసిన ఒక రోజు తర్వాత ఈ దాడి జరిగింది. ఉగ్రవాది, అతని సహచరుల గురించి లేదా ముఠా నుంచి ఏదైనా బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని దర్యాప్తు సంస్థ పేర్కొంది. దానికి సంబంధించి టెలిఫోన్ నంబర్లను కూడా విడుదల చేసింది. ల్యాండ్లైన్ నంబర్ 0172-2682901 లేదా మొబైల్ నంబర్ 7743002947 (టెలిగ్రామ్/వాట్సాప్ కోసం) సమాచారాన్ని పంచుకోవచ్చని వెల్లడించింది. సమాచారం ఇచ్చే వ్యక్తి ఎవరనేది గోప్యంగా ఉంచుతామని ప్రకటనలో పేర్కొంది.