తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) చావును కోరుకోవడం ఎంత దారుణమో బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీలో కేసీఆర్ చావును కోరుతూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హరీష్ రావు, దీనికి నిరసనగా శాసనసభలో సీఎం ప్రసంగాన్ని బహిష్కరించినట్లు తెలిపారు.
అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ చేసిన హరీష్ రావు, కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అసెంబ్లీలో పూర్తిగా అబద్ధాలు చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే 299 టీఎంసీల కృష్ణా నీటి పంపకాలు జరిగాయని, నిజానికి తెలంగాణలో అంత నీటిని వినియోగించేందుకు తగినన్ని ప్రాజెక్టులే లేవని అన్నారు. కాంగ్రెస్ ప్రాజెక్టులను నిర్మించలేకపోవడమే ఈ అన్యాయానికి కారణమని పేర్కొన్నారు.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో గతంలో కాంగ్రెస్ నేతలు ఒక్కరోజు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదని, అయితే తాము 40 రోజుల పాటు అసెంబ్లీని స్థంభింపజేశామని గుర్తుచేశారు. తెలంగాణ నీటిని కాపాడేందుకు తమ పార్టీ మంత్రుల పదవులను వదులుకున్నా, కాంగ్రెస్ నేతలు మాత్రం చంద్రబాబు దగ్గరకు వెళ్లి భోజనం చేసి వచ్చి కృష్ణా నీటిపై తాత్కాలిక నిర్ణయాలను ఆమోదించారని ఆరోపించారు.
కేసీఆర్ అంచెలంచెలుగా చేసిన పోరాటం వల్లే తెలంగాణకు నీటి న్యాయం సాధ్యమైందని హరీష్ రావు పేర్కొన్నారు. సెక్షన్ 3ని సాధించి 573 టీఎంసీల నీటిని తెలంగాణకు తెచ్చిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు. అంతేకాక, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై స్టే తెచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో నల్గొండ రైతులు నీటి కొరతతో తీవ్రంగా నష్టపోయారని, కానీ కేసీఆర్ నేతృత్వంలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు వల్ల ఖమ్మం జిల్లాకు నీటిని అందించగలిగామని హరీష్ రావు వివరించారు. గతంలో హుజూర్ నగర్ ని ముంచివేసి ఆంధ్రప్రదేశ్ మూడో పంటకు నీళ్లు ఇచ్చారని, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పులిచింతల నిర్వాసితులకు వందల కోట్ల రూపాయల పరిహారం ఇచ్చి, వారికి న్యాయం చేసిందని హరీష్ రావు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ మాటలు అబద్ధాలే, కేసీఆర్ పాలనతోనే తెలంగాణకు అభివృద్ధి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తోందని, అబద్ధాలే ప్రచారం చేస్తోందని హరీష్ రావు ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటేనే ప్రజలు మరోసారి ఆ పార్టీని నమ్మరని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు ఎప్పుడూ ముందుండిందని, భవిష్యత్తులోనూ తమ పోరాటం కొనసాగిస్తామని హరీష్ రావు తెలిపారు.
Chiranjeevi : చిరంజీవి-అనిల్ మూవీలో హీరోయిన్ ఆమెనేనా..?