కంటే కూతుర్నే కనాలి అంటారు. చివరి దశలో తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటుందని ఇలా చెబుతారు. కానీ హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ కూతురు చేసిన పని వింటే.. కంటే ఇలాంటి కూతుర్ను మాత్రం కనొద్దని చెప్పుకుంటారు. తుచ్ఛమైన వివాహేతర బంధం కోసం ఏకంగా కన్న తండ్రినే పొట్టన పెట్టుకుంది ఆ కసాయి కూతురు.
ముషీరాబాద్ ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య శారద జీహెచ్ఎంసీలో స్వీపర్గా పని చేస్తోంది. వీళ్ల కూతురు మనీషాకు పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలున్నారు. ఈమె తన భర్త కంచర్ల రమేశ్ను వదిలి మల్కాజిగిరికి చెందిన మహ్మద్ జావేద్తో కలిసి మౌలాలీలో ఉంటోంది. ఇది తండ్రి లింగంకు నచ్చలేదు. కూతురు ఇంటికి వచ్చినప్పుడల్లా భార్య, బిడ్డలను వివాహేతర సంబంధం గురించి ప్రశ్నిస్తూ విసిగించేవాడు. దీంతో తండ్రి తమకు అడ్డువస్తున్నాడని భావించిన కూతురు మనీషా.. అతన్ని చంపాలని నిర్ణయించుకుంది. తల్లి, ప్రియుడికి విషయం చెప్పి ప్లాన్ వేసింది.
ఓ రోజు లింగంకు ఇంట్లోనే కల్లులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. అయినా.. లేచి తిరుగుతుండడంతో తల్లీ కూతుళ్లు మళ్లీ వైన్స్కు వెళ్లి మద్యం తీసుకొచ్చారు. ఆ మందును మహ్మద్ జావేద్.. లింగంతో కూర్చొని తాగించాడు. మద్యం మత్తులోకి జారుకోగానే జావేద్.. లింగం ముఖంపై దిండు అదిమిపెట్టగా కూతురు చేతులను, భార్య కాళ్లను చున్నీతో బిగించి పట్టుకున్నారు. అయినా.. ఊపిరి ఆగకపోవడంతో జావేద్ అతడి ఛాతిపై పిడుగుద్దులు కురిపించాడు. అయినా ఆయన బతికే ఉన్నాడు. దీంతో మెడకు తాడుతో ఉరి బిగించి చంపేశారు.
ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న తర్వాత కూతురు తన ప్రియుడితో కలిసి సెకండ్షో సినిమాకు వెళ్లింది. అర్ధరాత్రి సినిమా పూర్తయ్యాక ఎదులాబాద్కు క్యాబ్ బుక్ చేశారు. డెడ్బాడీపై కల్లు, లిక్కర్ చల్లారు. క్యాబ్ డ్రైవర్ ఏమైందని ప్రశ్నించగా.. ఫుల్లుగా తాగి స్పృహ కోల్పోయాడని చెప్పారు. తల్లి, కూతురు డెడ్బాడీతో క్యాబ్లో ఎక్కగా, జావేద్ మాత్రం బైక్ పై బయలుదేరాడు. ఊరు రాకముందే ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు దగ్గర ఆపారు.
Also Read: Adulterated Milk Racket: చూడటానికి అచ్చం పాల లాగే ఉంటాయి.. కానీ పాలు కాదు, కాలకూట విషం!
ఊరిలోకి ఇలా వెళ్తే పరువు పోతుంది.. బట్టలు మార్చి.. తీసుకుని వెళ్తామని క్యాబ్ డ్రైవర్కు చెప్పారు తల్లీ కూతుళ్లు. తర్వాత లింగం వేసుకున్న సెక్యూరిటీ గార్డు షర్ట్ను విప్పి అక్కడే పడేశారు. తర్వాత డెడ్బాడీని చెరువులో పడేసి వెళ్లిపోయారు. చెరువులో శవం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి శరీరంపై గాయాలుండటంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు.
ముందు లింగం ఎవరో తెలియలేదు. తర్వాత చుట్టుపక్కల వెతకగా సెక్యూరిటీ గార్డు షర్ట్ కనిపించింది. దానిపై ఉన్న కంపెనీని సంప్రదిస్తే వారు చూసి లింగం అని గుర్తుపట్టారు. దీంతో వారి అడ్రస్ గుర్తించి ఇంటికి వెళ్లి భార్య, బిడ్డను విచారించారు. అయ్యో మా నాన్న చనిపోయాడా? ఎంత పనైపోయింది అంటూ డ్రామా మొదలు పెట్టారు తల్లీకూతుళ్లు. కానీ అక్కడికి లింగం ఎలా వెళ్లాడు? ఎందుకు వెళ్లాడు? అని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. దీంతో కొందరు కుటుంబసభ్యులను విచారించారు…స్పాట్..
మరోవైపు చెరువు దగ్గర వారి సెల్ఫోన్ సిగ్నల్స్ను ట్రేస్చేయగా.. అంతకుముందు రోజు రాత్రి అక్కడే ఉన్నట్టు తేలింది. గట్టిగా ప్రశ్నించడంతో తామే చంపినట్టు ఒప్పుకున్నారు. దీంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.