DGP Anjanikumar: రాష్ట్రంలో సైబర్ నేరాల మినహా అన్ని రకాల నేరాలలో పూర్తిగా తగ్గుదలలో ఉన్నాయని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. కేవలం హైదరాబాద్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ లిటరసీ గణనీయంగా పెరగడంతో పాటు సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో క్రైమ్, ఫంక్షనల్ వర్టికల్స్లపై పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ అంజనీ కుమార్ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఐడీ అడిషనల్ డీజీ మహేష్ భగవత్, మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్, రేంజ్ ఐజీలు చంద్ర శేఖర్ రెడ్డి, షా నవాజ్ కాసీ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలకు గురైన వారు అందించే ప్రతీ ఫిర్యాదుపై కేసును నమోదు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నేరాల నమోదు నిర్దారిత ప్రమాణాలలోనే ఉన్నాయని, వ్యక్తిగత నేరాల మినహా మిగిలిన నేరాలన్నింటిలోనూ తగ్గుదల ఉందని తెలిపారు.
ప్రజా అవసరాలకు అనుగుణంగా పోలీసు శాఖ పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజా మన్ననలు పొందేలా ముందుకు సాగాలన్నారు. పెరిగిపోతున్న వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పని చేయాలన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం ద్వారా తెలంగాణ పోలీసుల గౌరవం మరింత ఇనుమడించేలా పని చేయాలని సూచించారు. ముఖ్యంగా నిఘా వ్యవస్థకు ప్రధాన సంపత్తిగా మారిన సీసీటీవీల వల్ల భద్రతా ప్రమాణాలు పెరుగుతున్న క్రమంలో నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్లో సీసీ కెమెరాల ఏర్పాటును మరింత ప్రోత్సహించే విధంగా అన్ని జిల్లాల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.
Read Also: Artisans Strike: నేటి నుంచి ఆర్టిజన్స్ నిరవధిక సమ్మె
డీజీపీ కార్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ చేసిన సమీక్ష అనుసరించి రాష్ట్రంలోని మొత్తం 700 పోలీస్ స్టేషన్లలో 330 పోలీస్ స్టేషన్లు అద్భుతమైన పని తీరును కనబర్చాయని అన్నారు. ఇదేవిధమైన ఉత్తమ సేవలందించేందుకై మిగిలిన పోలీస్ స్టేషన్ల పనితీరును రెగ్యులర్ గా సమీక్షించాలని సీపీలు, ఎస్పీలను కోరారు. బ్లూ కోట్స్ పనితీరు అంశంలో ఉత్తమ పనితీరును కనపరిచిన పలు కమిషనరేట్లను, ఎస్పీలను డీజీపీ అభినందించారు. నేర పరిశోధనలో ఫోరెన్సిక్ సైన్స్ను ఉపయోగించడంపై స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్ అమలుపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు రాబట్టాలని ఆదేశించారు.
ఉత్తమ ప్రతిభ చూపిన పోలీస్ అధికారులకు సత్కారం
సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ డీఏవీ పాటశాల పోక్సో కేసు విషయంలో త్వరితగతిన దర్యాప్తు పూర్తిచేసి నిందితునికి 20 ఏళ్ల శిక్ష, నగదు జరిమానా విధించడంతో కృషి చేసిన దర్యాప్తు అధికారులు ప్రతాప్ రెడ్డి, బంజారాహిల్స్ ఎస్హెచ్వో నరేందర్లను డీజీపీ అంజనీ కుమార్ అభినందించారు. వీరికి పుష్పగుచ్చంతోపాటు ప్రశంసా పత్రం ఇచ్చి సత్కరించారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బాలికపై అత్యాచారానికి సంబందించిన కేసును దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడడంలో కృషి చేసిన అడిషనల్ డీసీపీ శివ కుమార్, ఎస్హెచ్వో నరేందర్ గౌడ్లను డీజీపీ సన్మానించారు. అదేవిధంగా, శివ సాగర్ అనే నిందితున్ని 18 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేయడంలో కృషి చేసిన ఇన్స్పెక్టర్లు వెంకటేష్, శ్రీనివాస్, ఎస్.పీ రాంరెడ్డిలను కూడా డీజీపీ సన్మానించారు.