Ex-Maharashtra minister Baba Siddique resigns from Congress: మహారాష్ట్ర కాంగ్రెస్కు వరుస షాకులు తగులుతున్నాయి. కేంద్రంలో వరుసగా పదేండ్లపాటు అధికారానికి దూరంగా ఉండడంతో పాటు సాధారణ ఎన్నికల్లో మళ్లీ గెలిచే అవకాశం లేకపోవడం, రాష్ట్రంలో బీజేపీ కూటమికి ఎదురులేకపోవడంతో పార్టీ సీనియర్ నాయకులు ఒక్కొక్కరిగా తమదారి తాము చూసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి మిలింద్ దేవరా కాంగ్రెస్కు గుడ్బై చెప్పగా.. మరో సీనియర్ నాయకుడు బాబా సిద్ధిక్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్న ఆయన.. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. “నేను యుక్తవయసులో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరాను ఇది 48 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఈ రోజు నేను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తాను. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.” అని ట్విట్టర్లో ప్రకటించారు.
Read Also: Congress: మోడీ సర్కారు పదేళ్ల పాలనపై కాంగ్రెస్ ‘బ్లాక్ పేపర్’..!
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని పార్టీలో సిద్ధిక్ చేరతారని భావిస్తున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నాయకులు చెప్పిన కొద్ది రోజులకే గురువారం నాటి పరిణామం జరిగింది. ఫిబ్రవరి 1న ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్తో సిద్ధిక్, ఆయన కుమారుడు ఎమ్మెల్యే జీషన్ భేటీ అయిన తర్వాత ఎన్సీపీ నేతలు ఈ ఊహాగానాలు చేశారు. బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సిద్ధిక్ మాజీ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ముంబై విభాగానికి ఛైర్మన్గా కూడా ఉన్నారు. ఆయన విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. మొదట బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కు కార్పొరేటర్గా ఎన్నికయ్యాడు.సిద్ధిక్ 1999, 2004 మరియు 2009లో బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ చేతిలో ఓడిపోయారు.