AP CM YS Jagan React on Cyclone Michaung Effect: ఏపీలోని తుపాను ప్రభావిత పరిస్థితులపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులంతా తమ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. బాధితుల స్థానంలో తాము ఉంటే ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో ఆ తరహా సహాయం అందించాలని, రూ. 10లు ఎక్కువైనా పర్వాలేదు.. అందరికీ మంచి సహాయం అందాలని సీఎం పేర్కొన్నారు.
‘ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుపాను వల్ల భారీ వర్షాలు పడ్డాయి. అధికారులంతా మీమీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టి పెట్టాలి. బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించండి. బాధితుల స్థానంలో మనం ఉంటే.. ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో ఆ తరహా సహాయం వారికి అందించాలి. రూ. 10లు ఎక్కువైనా పర్వాలేదు.. వారికి మంచి సహాయం అందాలి. ఇంత కష్టంలో కూడా బాగా చూసుకున్నారనే మాట రావాలి. పరిహారం అందించడం పట్ల సానుభూతితో ఉండండి. దెబ్బతిన్న ఇళ్ల విషయంలో, క్యాంపుల నుంచి ప్రజలను తిరిగి వెళ్తున్న సందర్బంలో వారికి ఇవ్వాల్సిన సహాయం అందించాలి’ అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
‘రేషన్ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదు. పంట పొలాల్లో ఉన్న వరద నీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపె ట్టాలి. అన్నిరకాల మానవ వనరులను దీనిపై పెట్టండి. ధ్యాసంతా ఇప్పుడు దీనిపై పెట్టాలి. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రభుత్వం ప్రతి రైతునూ ఆదుకుంటుంది. పంటల రక్షణ, తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం దగ్గర నుంచి అన్నిరకాలుగా తోడుగా ఉంటుంది. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ను పునరుద్ధరించాలి. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోండి. వర్షాలు తగ్గుముఖంపట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టండి’ అని సీఎం కోరారు.
Also Read: Narayana Swamy: వార్డు మెంబర్గా కూడా గెలవని లోకేష్.. రెడ్ బుక్ రాస్తున్నాడంట!
‘అధికారులంతా బాగానే పని చేస్తున్నారు. చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ కుటుంబానికి రూ. 30 లక్షల సహాయాన్ని అందిస్తాం. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్థైర్యం నిలబడేలా ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వాలంటీర్ల దగ్గర నుంచి పై స్థాయి ఉద్యోగుల వరకూ ఈ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని సీఎం జగన్ అధికారులతో అన్నారు.