టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సైబర్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అమాయకులను బురిడీ కొట్టించి అందినకాడికి దోచేస్తు్న్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఖాతాలు ఖాళీ చేస్తు్న్నారు. ఇటీవలికాలంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు ఎక్కువైపోయాయి. తాజాగా ఏకంగా న్యాయవాదికే ఝలక్ ఇచ్చారు సైబర్ నేరగాళ్లు. డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించి రూ. 19 లక్షలు కాజేశారు. ఈ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మచిలీపట్నంకు చెందిన ఓ ప్రముఖ న్యాయవాదికి కొన్ని రోజుల క్రితం డిజిటల్ అరెస్ట్ చేస్తామని సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. కర్ణాటక నుంచి డిజిటల్ అరెస్ట్ చేస్తామని బందరుకు చెందిన న్యాయవాదిని బెదిరించారు. కేసు నుంచి తప్పించుకోవాలంటే 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భయపడిపోయిన న్యాయవాది రూ. 19 లక్షలు కేటుగాళ్ల ఖాతాలో జమ చేశాడు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన న్యాయవాది మచిలీపట్నం ఆర్ పేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.