Cyber Fraud : సమాజంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ, దాన్ని అడ్డుపెట్టుకుని మోసాలకు పాల్పడే నేరగాళ్లు కూడా పెరుగుతున్నారు. ఇటీవలి కాలంలో కరెంట్ బిల్లు పెండింగ్ ఉందంటూ ప్రజలను మోసం చేసే సైబర్ నేరగాళ్ల మోసాలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఆన్లైన్ మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ హెచ్చరిస్తోంది.
సైబర్ నేరగాళ్లు బాధితులకు మెసేజ్ పంపుతూ, “మీ కరెంట్ బిల్లు పెండింగ్ లో ఉంది. ఈరోజు సాయంత్రం లోగా చెల్లించకపోతే మీ ఇంటికి కరెంట్ సరఫరా నిలిపివేస్తాం” అంటూ భయపెడుతున్నారు. ఈ మెసేజ్లో కొంత మంది లింక్ను జత చేస్తూ, “ఇక్కడ క్లిక్ చేసి తక్షణమే బిల్లు చెల్లించండి” అంటూ చెప్పిన లింక్ను క్లిక్ చేయమంటున్నారు.
పరిమిత సమయం ఇచ్చి బెదిరించడం, ఆందోళన కలిగించడం వంటి మార్గాల్లో బాధితులను ఒత్తిడికి గురిచేస్తున్నారు. భయంతో ఆ లింక్ను క్లిక్ చేస్తే, మోసగాళ్లకు తమ బ్యాంక్ అకౌంట్ వివరాలు వెళ్లిపోతాయి. ఈ విధంగా ఖాతాలో ఉన్న డబ్బులను క్షణాల్లో మాయమరిచేలా చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు ప్రధానంగా మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల నుంచి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. అవినాష్ గణేష్, రోహిత్ కుమార్ వంటి పలువురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. కానీ, ఇంకా ఎంతోమంది ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
లింకులు క్లిక్ చేయొద్దు: కరెంట్ బిల్లు చెల్లించాలంటూ వచ్చిన సందేశాల్లోని లింక్ను క్లిక్ చేయకుండా, అధికారిక వెబ్సైట్ ద్వారా బిల్లు చెల్లించాలి.
అధికారిక సమాచారం పొందండి: మీ కరెంట్ బిల్లు స్టేటస్ తెలుసుకోవడానికి ఎప్పుడూ డిస్కమ్ అధికారిక వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ను ఉపయోగించండి.
గూగుల్ సెర్చ్ చేయండి: మీకు సందేహం వస్తే, లింక్ను క్లిక్ చేయకుండా, మీ రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారిక వెబ్సైట్ను గూగుల్లో వెతకండి.
అనుమానాస్పద సందేశాలను అంగీకరించొద్దు: మీ ఫోన్కు వచ్చిన అనుమానాస్పద మెసేజ్లను నమ్మకండి. అటువంటి సందేశాలను తక్షణమే డిలీట్ చేయండి.
పోలీసులకు సమాచారం ఇవ్వండి: ఇలాంటి మోసపూరిత మెసేజ్లు వస్తే, పోలీసులకు ఫిర్యాదు చేయండి.