ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ క్రమంలో.. ఈరోజు వరంగల్ పర్యటన రేపటికి వాయిదా పడింది. నేడు జరగాల్సిన కార్యక్రమాలు యధావిధిగా రేపటికి వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం.. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం వరంగల్లో పర్యటించాల్సి ఉంది. మధ్యాహ్నం 1:30కి టెక్స్టైల్ పార్క్కు చేరుకుని, అనంతరం 2:10కి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పరిశీలించాల్సి ఉంది. ఓరుగల్లులో మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించడంతో పాటు సాయంత్రం వరంగల్ మున్సిపల్ అధికారులతో సమీక్ష జరపాల్సి ఉంది. అయితే, సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.
Read Also: Finger ice cream: ఐస్క్రీమ్లో మనిషి వేలు.. ఎవరిదో కనుక్కున్న ఫోరెన్సిక్ నిపుణులు..
ఇవాళ రాత్రి హైదరాబాద్కు చేరుకుని.. రేపు వరంగల్ పర్యటనకు వెళ్తారని అధికారులు వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ ఎన్నిక, కేబినెట్ విస్తరణపై ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. ఈ అంశం గురువారం కొలిక్కి రాకపోవడంతో రేవంత్ రెడ్డి శుక్రవారం కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వాయిదా పడింది. మరోవైపు.. సీఎం పర్యటన దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసు శాఖ కూడా భద్రతను కట్టుదిట్టం చేసింది.
Read Also: Rohit Sharma: విజయం తర్వాత రోహిత్ శర్మ ఎమోషనల్.. (వీడియో)