ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్ర పరిపాలనలో కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి. ఎజెండాలో ఉన్న వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై కూడా ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు, కలెక్టర్లు తమ పని తీరు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
‘ప్రజలు లేదా పెట్టుబడిదారులు కార్యాలయాలకు వచ్చినప్పుడు మాకు టైం లేదు, బయట వేచి ఉండండి, సమయం వచ్చినప్పుడు చూస్తాం అనే విధమైన ఆటిట్యూడ్ ఉండకూడదు. ప్రజలకు, పెట్టుబడిదారులకు సౌకర్యంగా ఉండే విధంగా అధికారులు వ్యవహరించాలి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం అత్యంత ముఖ్యం. ప్రతి జిల్లాలో పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు ముందడుగు వేయాలి. పెట్టుబడిదారులను ఆహ్వానించి పరిశ్రమలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు.
Also Read: YS Jagan: నల్లకాల్వలో ఇచ్చిన మాటే.. పార్టీ ఆవిర్భావానికి ప్రధాన కారణం!
‘వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అతి పెద్ద ఆస్తి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో వ్యవసాయం, మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయం లేదా ఇతర వనరులు తక్కువగా ఉన్న చోట టూరిజం, ఎంఎస్ఎంఈ రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. జిల్లాల వారీగా ఉన్న అవకాశాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి’ అని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు.